ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీనిని గురించి వివిధ గ్రంధాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును.పరమాత్మ అంశేజీవాత్మ.ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు.ఆత్మ స్వరూపం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు “ఎవరో ఒక మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును.ఆ విన్నవారిలో, చూచినవరిలో, చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా యెరుగరు”.(2:29)భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపాడు ."ఆత్మ చంపునని ఆత్మ చంపబడునని భావించువారివురూ అజ్ఞానులే. ఎందుకంటే నిజానికి ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడదు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు . దీనికి జన్మ లేదు . నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము, మార్పులేనిది, శాశ్వతమైనది, సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది, స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కాదు . మనస్సుకు తెలియదు. ఎటువంటి వికారాలు దీనికి ఉండవు.(2:19-25)" అని గీతలో పరమాత్ముడు చెప్పాడు. ముండకోపనిషత్తులో ఆత్మను గురించి ,"జ్యోతిస్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం. అణువుకంటే సూక్ష్మం. అంతటా వ్యాపించినదీ, అత్యంత సూక్ష్మమైనదీ, సృష్టికి మూలకారణమైనదీ. అపరిమితమైన జ్యోతిస్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం, అది ఈ శరీరలోనే ఉన్నది."ఆత్మ చైతన్యం దేహం అంతా వ్యాపించి జ్ఞానేంద్రియాలకు, మనస్సుకు, బుద్దికి అన్నింటికీ పనిచేసే శక్తిని ఇస్తుంది. అందువలన ఆత్మే పనిచేస్తోంది అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆత్మ ఏ పనీ చేయదు. మనకు సంక్రమించిన కర్మల వలన వచ్చే బాధలకు,సుఖాలకు ఆత్మకు సంబంధం లేదు . అన్ని భావాలను తెలియచేసేది ఆత్మచైతన్యము. ఆ ఆత్మచైతన్యం కేవలం చూస్తూ ఉంటుంది. కానీ అనుభవాన్ని పంచుకోదు.అంటే ఆత్మ సాక్షిగా ఉంటుంది.సాక్షి అంటే ఆ కర్మలో ఏమాత్రం భాగస్వామి కాదు. ఆత్మకు కర్తృత్వం , భోక్తృత్వం లేదు. దేహము, ఇంద్రియాలు జడస్వరూపమైనవి. ఇవి అన్నీ కూడా ఆత్మచైతన్యం వలనే వాటి పనులు చేస్తాయి.ఆత్మ వాటిని ప్రకాశింపచేస్తుంది. ప్రకాశాన్నిచ్చేది, ప్రకాశింపబడేది ఒక్కటి కాదు,కాలేదు!జడస్వరూపాలైన ఈ ఇంద్రియాలు ఆత్మను తెలుసుకోలేవు . ఆ ఆత్మచైతన్యం అన్నింటినీ సాక్షిగా చూస్తుంటుంది ఉంటుంది,అనుభవాలను మాత్రం పంచుకోదు. మానవ జీవితాలలో ఇది సాధ్యమేనా అంటే,పట్టుదల ఉంటే సాధ్యపడుతుంది. ఇది మోక్షానికి ఒక మార్గం.అజ్ఞాని ఆత్మను తెలుసుకోలేక ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు ఆపాదిస్తున్నాడు. మనస్సులోని ఆత్మ చలించదు.మరణించిన తర్వాత ముందుగా మనుషి జ్ఞానాన్ని కోల్పోతాడు.అందుకే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం.మరణం తరువాత ఆత్మ--మనస్సు,బుద్ధినీ కూడా తీసుకుని భౌతిక శరీరంనుంచి బయటకు వస్తుంది.
న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయనం
భూత్వా భవితా వా న భూయః,
అజోనిత్యః శాశ్వతో యం పురాణో
నహన్యతే హన్యమానే శరీరే.
అన్నీతెలిసిన ఆత్మ పుట్టదూ, చావదు. దేన్నుంచీ అది పరిణామం చెందదు. దాని నుంచీ ఏదీ పరిణామం పొందదు.శరీరం నశించినా ఆత్మ శాశ్వతం.జన్మరహితమైన ఆత్మకు నాశనమనేదే లేదు. ఇది సత్యం.ఆత్మ ఎటువంటి శరీరంలోనైనా ఇమిడిపోతుంది.విత్తు జీవాత్మ అయితే చెట్టు పరమాత్మ!జీవాత్మ పరమాత్మల అస్తిత్వాన్ని ‘ఏకం’గానే పరిగణించడం జరుగుతోంది.మనం ఆత్మకు ఆకారం ఉండదని నమ్ముతాం. కానీ జపాన్ దేశస్తులు ఆత్మలకు ఆకారాలు ఉంటాయని నమ్ముతారట!ఆత్మలకోసం, ఆత్మలు వాడుకోగలిగే వస్తువులు అమ్మే షాపులు కూడా అక్కడ ఉన్నాయట!
అక్కడ ఆత్మలకని కొన్ని వస్తువులను తయారుచేసి అమ్ముతారట!చనిపోయిన వారి సమాధిలో ఈ వస్తువులను కూడా ఉంచి పూడ్చిపెడతారట!ఈ వస్తువులను ఆత్మలు ధరిస్తే అవి వాటికి ఎటువంటి హానీ కలిగించవని వారి నమ్మకం.యోగము గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే స్థాయి ఆత్మదర్శనం.కర్మ సిద్దంతాన్ని భోదించిన భగవత్గీత ప్రకారం ఆయా జన్మల కర్మ ఫలాన్ని అనుభవించటానికి కర్మల ఫలాన్ని తీసుకొని ఇంకొక జన్మని పొందుతుంది ఆత్మ.కానీ ఆత్మహత్య చేసుకున్న మనుషుల విషయంలో----వారు తమ జీవిత కాలాన్ని పూర్తి చేయకుండానే ఆత్మహత్య ద్వారా ముగించేస్తేఏమవుతుంది? ఆత్మహత్య అనేది సహజ మరణం కాదు.ఆత్మహత్య అంటే మన చేయాల్సిన కర్మలను వదిలేసి తాత్కాలికంగా తప్పుకోవటమే!అయితే వీరు మరో జన్మలో పూర్తిచేయని(ఈ జన్మలో) కర్మలను అనుభవించాల్సిందే!ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు అవధులు దాటినా తర్వాత కలిగే అనుభూతి.ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే.ఆత్మ పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది.దీన్ని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. దీన్ని తెలుసుకోవటానికి అంతర్దృష్టి కావాలి .
శుభం భూయాత్!