కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
వీక్షణం నాల్గవ వార్షికోత్సవ సమావేశం సమీక్ష
- సుభాష్ పెద్దు

వీక్షణం నాల్గవ వార్షిక సమావేశం దుర్ముఖి నామ సం|| భాద్రపద శుద్ధ నవమి నాడు, అనగా సెప్టెంబర్ 11, 2016 నాడు, కిక్కిరిసిన సాహితీ ప్రియుల మధ్య, అమెరికా లోని కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది.

సభ కిరణ్ ప్రభ గారి స్వాగత వచనాలతో ఆవిష్కరించబడినది. "సిలికాన్ లోయలోని తెలుగు సాహిత్య ప్రియులకు వీక్షణం ఒక ఆత్మీయ సమావేశం. డా|| కె.గీత గారు ఒక అసామాన్య శక్తి లాగా ఈ వీక్షణాన్ని నడిపిస్తున్నారు, ఆవిడకు అందరి తరఫునా ధన్య వాదాలు" అని తెలిపి ఉదయం సభకు అధ్యక్షత వహించవలసినదిగా తాటిపామల మృత్యుంజయుడు గారిని ఆహ్వానించారు.

మృత్యుంజయుడు గారు ప్రవాస తెలుగు సాహిత్యంలో సైన్సు కథల ఒరవడిని మొదలు పెట్టిన వేమూరి వెంకటేశ్వర రావు గారిని సభకు పరిచయం చేసి, మహాభారతంలో పునరుచ్చరించబడిన సరళిని గురించి ప్రసంగించటానికి ఆహ్వానించారు.

వేమూరి గారి ప్రసంగం: "కొందరు మాత్రమే యుగ పురుషులు. సంఘంలో పేరుకు పోయిన నైతిక నియమాలని కూకటి వేళ్లతో పెల్లగించి వాటికి సరికొత్త భాష్యం చెప్పగలిగిన వారిని యుగ పురుషులు అంటారు. శంకరాచార్యులు ఒక ఉదాహరణ. వారికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే జన్మించిన యుగ పురుషుడు వేద వ్యాసుడు. పరాశర మహర్షి, సత్యవతులకు జన్మించి, ముందు కృష్ణ ద్వైపాయనుడుగా పేరు పొంది తరువాత మనకు వేద వ్యాసుడుగా తెలిసిన యుగ పురుషుడు. వారు వ్రాసిన మహాభారతంలోని కొన్ని వింత సరళులు ఇవి.

ఉదాహరణకు వంశ పారంపర్యముగా పెద్ద కుమారునికి రాజ్యాధికారం దక్కలేదు. ఉదాహరణకు భీష్ముడుకి కాకుండా అతని తమ్ముడు విచిత్రవీర్యునికి రాజ్యం దక్కింది. ఆ తరువాత కర్ణుడికి కాకుండా ధర్మరాజుకి రాజ్యం దక్కింది. ఆ తరువాత ద్రౌపది పిల్లలకెవెరికీ రాజ్యం దక్కకుండా అర్జునుడి మనమడైన పరీక్షత్తుకి దక్కింది.

ఇంకొక బాణీ శంతనుడికి సత్యవతితో వివాహం కాక పూర్వం, గంగ తో ఉన్న పూర్వ వివాహ సంపర్కం వల్ల దేవవ్రతుడు పుడతాడు. అలాగే కుంతికి వివాహం కాక పూర్వమే సూర్యునితో ఉన్న పూర్వ వివాహం సంపర్కం ద్వారా కర్ణుడు పుడుతాడు. అలాగే మహాభారతంలో పలు అంశాలు పునరావృతమయ్యాయి. స్టార్ ట్రెక్ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలలో కూడా ఇటువంటి సరళులు కనబడతాయి."

తరువాతి ప్రసంగం వేణు ఆసూరి గారిది. వారు రామాయణ మాధుర్యం గురించి చేసిన ప్రసంగ విశేషాలు: "వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అయోధ్యా కాండలలోని కొన్ని మధురమైన ఘట్టాలను, ఆదర్శవంతమైన పాత్రల తీరుతెన్నులను ప్రస్తావించడం జరిగింది. రాముని జననం, విశ్వామిత్రుని యాగ రక్షణ, శివధనుర్భంగం, సీతారాముల కల్యాణం, కైకేయి కోరికపై రాముని వనవాసం మొదలైన ఘట్టాలను, సందర్భోచితంగా వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు ఉపన్యాసంలో చోటు చేసుకున్నాయి. రామకథ కష్టాల పరంపరల వ్యథ అయినా, ఆదర్శవంతమైన పాత్రలు, వ్యక్తిత్వాలతో, అద్భుతమైన రచనతో అలరారే రామాయణసుధ తరతరాలుగా భరతజాతికి నిత్యపారాయణ గ్రంథంగా నిలిచిపోయింది.

రామాయణ కథలోని ఒక విశేషం, కైకేయికి రాముడు అంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను మధించింది మంధర. మంధర పర్వతం పాల సముద్రాన్ని మధించినప్పుడు ఎన్నో గొప్ప గొప్పవి లభిస్తాయి. కానీ మంధర కైకేయి మనస్సును మధించినప్పుడు వచ్చిందే రామ కథ."

విశిష్ట అతిథులు గా ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి, శ్రీమండలి బుద్ధ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, శ్రీ కోమటి జయరామ్ గార్లు వీక్షణం సమావేశాలకు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా శ్రీమండలి బుద్ధ ప్రసాద్ గారు శ్రీ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణగారి "తెలుగు సంస్కృతి- శాసనాలు చారిత్రక పరిణామాలు" పరిశోధనా గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆచార్య వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈ గ్రంథాన్ని విశ్లేషిస్తూ, "ఇది శాసనాల ఆధారంగా తెలుగు సంస్కృతి పరిణామాలను పరిశీలించిన పరిశోధన గ్రంథం. తెలుగు నాట శాసనాలను, ముఖ్యంగా 6 వ శతాబ్ది నుంచి 16 వ శతాబ్ది దాకా వచ్చిన తెలుగు శాసనాలను, అధ్యయనం చేసి తెలుగు సమాజంలో, సంస్కృతిలో కలిగిన చారిత్రక పరిణామాలను చర్చించే సిద్ధాంత గ్రంథం. సిద్ధాంత గ్రంథమైనా, చేతబట్టుకొంటే వదిలిపెట్ట బుద్ధి పుట్టనంతగా 'చదివించే గుణం ఉంది" అని తెలిపారు. పేరుకు శాసనాలన్నా, అనేక ఇతర ఆధారాలను కూడా తీసుకొని తెలుగు సంస్కృతిని వివరించే ఒక సమగ్ర గ్రంథంగా ఇది రూపొందిందని ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన మాన్యశ్రీ బుద్ధప్రసాద్ గారు పేర్కొన్నారు. సమకాలీన దృష్టితో అలా చరిత్రను చూపినందుకు రచయితను అభినందిస్తున్నానని ముఖ్యఅతిథి శ్రీ బుద్ధప్రసాద్ గారు కొనియాడారు. తెలుగు సంస్కృతిని అభిమానించే ప్రతివారూ చదవవలసిన పుస్తకమని సభాధ్యక్షులు శ్రీ కిరణ్ ప్రభ గారు పేర్కొన్నారు.

ముందుమాటగా ఆచార్య లక్ష్మీనారాయణ గారు రాసిన ఈ మాటలు అందరినీ ఆకట్టుకొన్నాయి:

" హాలికుల హలంతో, భావుకుల భావనాబలంతో
'సృష్టింప'బడేది సంస్కృతి
సైనికుల భుజబలంతో, సంపన్నుల ధనబలంతో
' నిర్మింప' బడేది నాగరకత
ఒకటి చరిత్ర! మరొకటి చరిత! "

ఇంత మంచి పుస్తకాన్ని 'వీక్షణం' వేదిక మీద ఆవిష్కరించడం తమకు గౌరవ కారకమని సభ్యుల పక్షాన సమన్వయకర్త ధన్యవాదాలు తెలిపారు.

ఆచార్య గంగిశెట్టిగారు తెలుగు అక్షరమాల గురించి వ్రాసిన "మన సుభాష" అనే ఒక ముఖ్యమయిన వ్యాసాన్ని కూడా బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరించారు.

ఆ తరువాత మండలి బుద్ధ ప్రసాద్ గారు మాట్లాడుతూ: "మనం ఇక్కడ వాళ్ల దగ్గర నుండి కూడా నేర్చుకోవల్సినది ఉంది. ఉదాహరణకు, భారత దేశం శాంతి దేశం. అమెరికా క్రమశిక్షణ కలిగిన దేశం. మా చిన్నప్పుడు సినిమా హాలులో హీరో కనపడితే అరుపులు, ఈలలూ, కాగితాలు చించి ఎగరవేయటం వంటివి చేసేవారు. ఇప్పుడు ఈ చెడు అలవాటు భారత దేశంలో లేదు. అటువంటిది ఇక్కడ తెలుగు వాళ్లు సినిమా హాలులో చేసే అల్లరిలో ఉంది. ఇది చాలా విచారకరం. అందరూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, ఇక్కడి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. అలాగే ఇక్కడి తెలుగు వాళ్లు కులతత్త్వ రాజకీయాలు, ప్రాంతీయ తత్త్వం గురించి మాట్లాడడం విచారకరం" అన్నారు.

వీక్షణం మిత్రుల రచనా సంకలనం-2016, గత సంవత్సరపు వీక్షణం సమావేశాల సంకలనాలను శ్రీ బుద్ధ ప్రసాద్, శ్రీ కోమటి జయరామ్ గార్లు ఆవిష్కరించారు. బుద్ధ ప్రసాద్ గారు మాట్లాడుతూ "భాషా ప్రేమికుడినైన నాకు అమెరికాలో జరుగుతున్న ఇటువంటి సాహితీ సభకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంత మంచి సభలు జరుగుతున్నాయంటే నమ్మలేకుండా ఉన్నాను." అంటూ నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న వీక్షణం నిర్వాహాకులకు అభినందనలు తెలియజేసారు. "వీక్షణం మిత్రుల రచనా సంకలనం-2016" మొదటి ప్రతిని శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి కిరణ్ దంపతులకు, "వీక్షణం సమావేశాల సంకలనం" మొదటి ప్రతిని శ్రీ పెద్దు సుభాష్ కు బుద్ధ ప్రసాద్ గారు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల అంతర్జాల భాండాగారం "తెలుగు రచయిత" వివరాలను, అందుకు సహకరిస్తున్న గాటా సభ్యులను అధ్యక్షురాలు డా.కె.గీత పరిచయం చేశారు. "తెలుగు రచయిత" పై ప్రతిస్పందిస్తూ బుద్ధ ప్రసాద్ గారు అంతర్జాలంలో రచయితల వివరాలు ఎక్కడా లభ్యం కావడం లేదన్న తన స్వానుభవాన్ని వివరిస్తూ "తెలుగు రచయిత" ఆ లోటు ని భర్తీ చేయడానికి పూనుకోవడం మహత్తరమైన విషయమనీ, అందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పక అందజేస్తామనీ సభా ముఖంగా మాటిచ్చారు. అదే సందర్భంలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు "తెలుగు రచయిత" కు తమ వంతు తోడ్పాటుగా యాభైవేల రూపాయల చెక్కును బహూకరించారు.

శ్రీ కోమటి జయరామ్ గారు మాట్లాడుతూ వీక్షణానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. తమ చేతుల మీదుగా శ్రీ బుద్ధ ప్రసాద్ గారిని సన్మానించారు.

భోజన విరామ ప్ర్రారంభంలో వీక్షణం నిర్వాహకురాలు శ్రీమతి కె. గీత దేవులపల్లి వారి "అనరాదా మనసారా" లలితా గీతాన్ని అత్యంత వీనుల విందుగా ఆలపించి సభను అలరించారు.

భోజన విరామానంతరం మొదటి వక్త అనిల్ రాయల్ గారు తను కథలు ఎందుకు వ్రాస్తున్నానో వివరిస్తూ "నేను ఎవరికోసమో, ఎవరినో ఉద్ధరించటానికో, ఏదో ప్రయోజనం ఆశించో కథలు వ్రాయటంలేదు. నేను కేవలం నాకు నచ్చినట్లే, నా సంతృప్తి కోసమే వ్రాస్తున్నాను. అటువంటి సంతృప్తి ఉన్నప్పుడే కథ నాది అవుతుంది" అన్నారు.

ఆ తరువాత సురేంద్ర దారా గారు తమ హాస్య ప్రసంగంలో అమెరికాలోని భారతీయ కిరాణా దుకాణాలలోని మురికిని పరిహసించారు.

మధ్యాహ్నం సదస్సు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, శ్రీ మహమ్మద్ ఇక్బల్ గార్ల అధ్యక్షతన కొనసాగింది. అధ్యక్షుల వారి ఆహ్వానంతో రావు తల్లాప్రగడ గారు చేసిన మొదటి ప్రసంగం "సీతమ్మ గారి తత్త్వాలు". "సత్యాత్మ జ్ఞాన యోగ సాధన మోక్ష గ్రంథం" లో పొందు పరచబడిన సీత్తమ్మ గారి తత్త్వ జ్ఞానం గురించి వారి ప్రసంగ విశేషములు: "మనకి తత్త్వాలు అంటే మొదట గుర్తుకు వచ్చేది బ్రహ్మంగారు, వేమన, చెన్నయ్య దాసు వంటి వారు. వీరు విభిన్నమైన సరళులతో తత్త్వ జ్ఞాన్నాన్ని మనకు అందించారు. ఆ కోవకే చెందిన మహానుభావురాలు సీతమ్మ. వారు 1921వ సం|| చెరుకూరి బ్రహ్మయ్య, శ్రీరామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెన్మత్స గ్రామంలో జన్మించారు. ఆ నాటి కాలాచారాలని బట్టి బాల్య వివాహం, ఆ తరువాత ఆవిడ 18 ఏళ్ల వయసులోనే భర్త మరణంతో పుట్టింటికి రావడం జరిగినవి. ఈ ఆపత్కాలంలో సీతమ్మ గారిని దండమూడి పూర్ణయ్య గారు ఆధ్యాత్మిక యానం వైపు నడిపించారు. ఆవిడ 10 రోజులలో వేదాధ్యాయనం పూర్తి చేసి, సూర్యజపం ఆచరించి, రామ కోటిని పూర్తి చేసి భద్రాచల రామునికి అర్పించారు.

ఆవిడకు రెండవ గురువు కమ్ముల అప్పన్న. ఆయన దగ్గర యోగాభ్యాసం చేసి నిమ్మకాయ నీరు మాత్రమే త్రాగుతూ అన్నపానాదులను మాని వేసింది. కుండలినీ యోగము కూడా సాధించారు. ఆ తరువాత మాల పిచ్చమ్మ గారి ఆశీర్వచనంతో సీతమ్మగారు సవికల్ప సమాధిలో గడిపారు. ఆ తరువాత తీవ్ర సమాధిలో గడిపిన సీతమ్మ గారు తత్త్వాలు ఒక కాగితం మీద వ్రాసి గదిలో నుండి బయటకు విసిరేవారట. ఆ తత్త్వాలకు యతి ప్రాసలు పాటించారు. రాగం, తాళం కూడా ఆ కాగితం మీదే వ్రాసేవారు. కానీ సీతమ్మగారు పాడిన దాఖలాలు అయితే ఏమీ లేవు.

రావు తల్లాప్రగడ గారు సీతమ్మ గారి తత్త్వాలను పాడి వినిపించారు. ఆ తత్త్వాలు:

1. రవ్వలు చెక్కిన ముత్యాల పంపున ..

2. అమ్మవైన ఆ నీవేనమ్మా మహాయోగి

3. చూడ చక్కని చిన్నది

4. జయ జయ యోగి, జయ మహా యోగి

తర్వాత జరిగిన కిరణ్ ప్రభ గారి తెలుగు సాహితీ క్విజ్‌తో సభికులను కిత కితలు పెట్టి, కొత్త విషయాలు తెలియబరిచి, ఉత్సాహపరిచి వీక్షణం సమావేశానికి నిండుదనం తెచ్చారు. ఈ సారి కూడా ఈ క్విజ్ కార్యక్రమం అత్యుత్సాహంగా జరిగింది.

తర్వాత శ్రీమతి కొండేపూడి నిర్మల గారు తెలుగు సాహితీ ప్రపంచములో స్త్రీ చైతన్యాన్ని, వారి కృషిని, గత నాలుగు దశాబ్దాల కాలములో వచ్చిన పరిణామాలను విశ్లేషిస్తూ, చేసిన ప్రసంగం: "11వ శతాబ్దంలోని దళిత కవయిత్రి మొల్ల దగ్గర నుంచి 1882 లో పుట్టిన సుగార్ హుమాయూన మీరాజ్నుంచి ఇవాళ్టి షాజహానా వరకూ, కుల, మత, పితృస్వామ్య భావజాలమే తమ ప్రధాన శత్రువు అని గుర్తించాలి. గత నాలుగు దశాబ్దాల కాలం స్త్రీ కవిత్వంలో ముఖ్య దశ. తెలుగులో అస్తిత్వవాద కవిత్వానికి బలమైన ప్రతినిధి రేవతీ దేవి. ‘’ నేనెవరినో మీకు తెలియదు/ఆర్తి సెగతో ఎర్రగా జీవించే నీలం నిప్పు రవ్వని" , ఆదూరి సత్యవతి "అలాగే ఎప్పుడూ ఏదో ఒక మూల నాలో జరుగుతూ వుంటుంది / ఒక దీపతోరణ జ్వలనోత్సవం" అంటూ ఉదహరించారు.

1970లలో రచయిత్రులుగా స్త్రీలు తామేమిటో నిర్వచించుకునే తొలి ప్రయత్నాలు పార్రంభించారు. ఓల్గా 1972 లో రాసిన ప్రతి స్త్రీ నిర్మల కావాలి అన్న కవిత ఇందుకు బలమైన ప్రతినిధి.

1980లలో దళిత స్త్రీవాదం ప్రాముఖ్యం సంపాదించుకుంది. కొలకలూరి స్వరూప రాణి నగ్న దేహము జూడగ భాయో/ ద్విగ్నమతివై పోతివందురు/ చోద్యమ౦తకు క్రితము ఎన్నడూ/ చూడనే లేదా? అని ప్రశ్నిస్తుంది. మైనారిటీ స్త్రీ వాద కవిత్వానికి పలువురు ప్రతినిధులు. పరధాను వాజిదా ఖాటూస్ అనే కవయిత్రి , బాల్యం లోనే నిఖాచేసి /దూరం చేశారు నీ బాల్య మధుర స్మృతిని/కట్టుభాట్ల పేరుతో నీ అభివృధిని సఫాచేసి తెచ్చారు నిన్ను హీన స్థితికి" అన్నారు. అంటూ కొనసాగించారు.

ఆ తర్వాత ప్రసంగించిన చుక్కా శ్రీనివాస్ బాలగోపాల్ రూపం- సారం పుస్తక పరిచయం చేస్తూ " సాహిత్యం జీవితమంత విస్తృతమైంది ఆంటారు బాలగోపాల్. సాహిత్యానికి - ముఖ్యంగా కథా సాహిత్యానికి - మానవ సంబంధాల సామాజిక విశ్లేషణ మూల వస్తువు; సాహిత్యాన్ని సాహిత్యం చేసేది రూపమే అని వివరిస్తూ, జీవితంలో ఖాళీలు పూరించడమే సాహిత్యం విశిష్ట పాత్ర అంటూ ఒక లోతైన తాత్విక దృక్పధం మన ముందు ఉంచుతారు." అన్నారు. "బాలగోపాల్ 1908-2009 ల మధ్య వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల పై ఆలోచింపజేసే అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గణిత శాస్త్రజ్ఞుడు, న్యాయ వాది అయిన ఆయన విషయాలను శాస్త్రీయంగా నిరూపించారు. తెలుగు సాహితీ చరిత్రకు ఒక కోశాంబి ని పరిచయం చేశారు." అంటూ ప్రసంగించారు.

కవిసమ్మేళనానికి శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ అధ్యక్షత వహించారు. సంస్కృతాంధ్ర పండితులు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అయినా శ్రీ వెంకట శివయ్య గారు ఈ కవిసమ్మేళనంలో ముందుగా పాల్గొనడం విశేషం. శ్రీ తుర్లపాటి రామానుజ రావు "రూపాయి" మొదలయిన కవితలను, శ్రీ మతి రాధిక "మొక్కలకు శ్రీకారం", శ్రీ నాగ సాయిబాబా "తకల్లుస్ ", డా||కె.గీత "రెక్కచాటు గెలుపు", శ్రీమతి నిర్మల "అద్దం", శ్రీ రావు తల్లాప్రగడ సనాతనీ శివాని మంగళం అంటూ కవితలను వినిపించగా, శ్రీ వరకూరు గంగా ప్రసాద్ రచించిన పాటలను వారు కుమార్తె ఈశా రాగయుక్తంగా పాడి అందరినీ అలరించింది. శ్రీ వనపర్తి సత్యనారాయణ ఈ సందర్భంగా సూఫీ తత్త్వాన్ని గురించి చక్కని పద్యాలతో వివరించారు. చివరగా అధ్యక్షులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ తమ విశిష్ట పద్య పాటవంతో అందరిని ముగ్ధులను చేశారు.

చివరగా శ్రీ కిరణ్ ప్రభ "విశ్వనాథ వారి చివరి నవల "కుక్కగొడుగులు" గురించి ఆలోచనాత్మక ప్రసంగం చేయగా, శ్రీ చరణ్ 'వేదము - పరమాత్మ సాహిత్య సౌందర్యము' అనే అంశం పై

"ఆత్మ జ్ఞాన ప్రశ్న పరంపర - అవ్యక్త కావ్యాలంకారము. వేదములో సూక్ష్మముగా, పరోక్షంగా అంతర్లీనమై ఉన్న ఎన్నో ప్రక్రియలలో ఒకటైన కావ్య సౌందర్యము" అంటూ ప్రసంగించారు.

చివరగా వందన సమర్పణ సమయంలో శ్రీ చిమటా శ్రీనివాస్ వీక్షణానికి మైకు సెట్ ను బహూకరించారు. శ్రీ లెనిన్, శ్రీ గుత్తా రాజశేఖర్రావు, శ్రీ భాస్కర్ కూరపాటి, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ వేమూరి శ్రీ రామ్, శ్రీ సుభాష్ పెద్దు ,శ్రీ సత్యనారాయణ, శ్రీ కోట రెడ్డి, శ్రీమతి ఉమ, శ్రీమతి షర్మిల, శ్రీమతి కాంతి, శ్రీమతి మాధవి కడియాల, శ్రీమతి షంషాద్, శ్రీమతి శారద, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి మంజుల జొన్నలగడ్డ, శ్రీమతి హేమలతా దేవి, శ్రీమతి సరస్వతి, శ్రీమతి విజయ మొ.న వారు హాజరైన ఈ సభ ఉదయం నించి సాయంత్రం వరకూ సాహితీ విందును పంచుతూ ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)