కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
వీక్షణం సమీక్షణం - 48
- పెద్దు సుభాష్

వీక్షణం 48వ సమావేశం శ్రీమతి వేమూరి ఉమ, శ్రీ వేంకటేశ్వర రావు గారి స్వగృహమున దుర్ముఖి శ్రావణ ఏకాదశి నాడు, అనగా ఆగస్టు 14, 2016 నాడు జరిగినది. నాలుగు సంవత్సరాల క్రితము, వీక్షణం ప్రారంభ వేదిక వేమూరి వారి లోగిలి. సభ ప్రారంభిస్తూ వేమూరి వేంకటేశ్వర రావు గారు, వీక్షణం నిరాటంకముగా జరగటానికి గీత గారి పట్టుదల, కార్య దక్షత అని కొనియాడారు.

వేంకటేశ్వర రావు గారు వారి భారత దేశ పర్యటన అనుభవాలు పంచుకుంటూ, అక్కడ జరుగుతున్న సాహితీ సమావేశాలకి, వీక్షణం సమావేశానికి గల వైవిధ్యాలను వివరించారు. భారత దేశములో జరిగే సాహితీ సమావేశాలలో సాధారణముగా ఒక్క విషయము మీద మాత్రమే చర్చ జరుగుతుంది. అంటూ వీక్షణం లో వైవిధ్య కార్యక్రమాలు జరగడం విశేషం అన్నారు.

ఈ సమావేశములోని మొదటి కార్యక్రమం తుర్లపాటి రామానుజరావు గారి "ఉదయాన్నే వెలసిన వర్షం" కవితా సంకలనం, పుస్తక ఆవిష్కరణ. ఈ పుస్తకములో తెలుగు కవితలు, ఆంగ్ల కవితలు, కొన్ని కవితానువాదాలు ఉన్నాయి. ఈ పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ, ఆచార్య గంగిశెట్టి గారు చెప్పిన మాట "ఆర్ద్రతే ఇతని రస దృష్టి" అని కొనియాడారు.

ఈ పుస్తకాన్ని మొదట సమీక్షించిన వారు శ్రీ వేణు ఆసూరి గారు. ఆయన ప్రసంగ విశేషములు: "రామానుజా రావు గారి కవితలు మనము ప్రతి రోజూ చూసి, గమనించే విషయాలు. ఉదాహరణకు ఒక ప్రయాణం, వర్షం కురిసిన రాత్రి, నిజ జీవితములోని ఒక ఘోర కృత్యం, లేక ఒక అందమైన అమ్మాయి. ఆయనది నిజాయితీ కలిగిన కవితా రీతి. కదిలిపోయిన గుండెల్లోని భావా లకి, మనసులోని ఆనందానికీ అక్షర రూపం. లోతైన భావాలకోసం ప్రాకులాట లేని కవితలు సహజంగా, సున్నితంగా, తడుముకోకుండా వెలువడ్డ భావాలు. అందుకే చదవడానికి హాయిగా ఉన్నాయి." ఆ తరువాత పుస్తకములోని కవితలను కొన్నిటిని ఉదహరించారు.

రామానుజం గారి ఉదయాన్నే వెలసిన రాత్రి కవితా సంకలానానికి రెండవ సమీక్షకులు అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు. వారి ప్రసంగ విశేషములు: ""తుర్లపాటి "వారి "ఉదయాన్నే వెలసిన వర్షం "కావ్యావిష్కరణలో నేనూ సమీక్షకుడిని గావడం ఆనందంగా వున్నది. రాయల వారి ఆస్థానములో వడ్డిచర్ల తుమ్మయ్య అనే కవి కంద పద్యాలతో వర్షం గురించి రచించాడు. తరువాతి కాలంలో జాషువా వర్షం గురించి పద్య కవిత్వం చెప్పారు. ఈ కాలములో రామానుజం గారు వర్షం గురించి వచన కవిత్వం చెప్పారు. ఈ పుస్తకానికి చక్కని పీఠికలు గంగిశెట్టి గారు, అరణ్య కృష్ణ గారు వ్రాసారు. కవులన్న నిత్య మానస సరోవర రస ప్రియత్వం కలిగిన వారు. ఈ లక్షణం తుర్లపాటి వారిలో కనబడుతుంది. పొడి పొడి మాటలు, కాల్పనిక ధోరణి లేకుండా ఉంది వారి కవిత్వం. "రామానుజరావు "గారు నిస్సంశయంగా గొప్ప భావుకుడు, కవితాత్మ తెలిసిన వ్యక్తి . భాష,శైలి ఆలోచనా సరళి అన్నీ ఒక అనుభూతిని కలిగించేవిలా ఉన్నాయి.

"అభినందనీయుడు తుర్లపాటి"

సీ.రమణీయ భావాల కమనీయ దృశ్యాల
చిత్రణన్ చెలువంపు శిల్పివీవు
ఎదహత్తుకుని పోవు పదబంధ సృష్టిలో
సుకవి "బాపన్నకు"నకలు వీవు
ఆంధ్రామ్ గ్లముల యందు ననఘులౌ కవి పాళి
నాడి బట్టిన యట్టి వాడ వీవు
"నిర్మల"హృదయాన నిరతమ్ము వర్తించు
శాంత చిత్తుడవైన సఖుడ వీవు

అరయ నిన్ను "రామానుజుం"డనుట కన్న
అతని అగ్రజుడై ధాత్రి నలరినట్టి
శాంత గుణు డైన "శ్రీరామ చంద్ర మూర్తి
వనుచు భావింప పాడిలే అఖిల గతుల !

భావ కవిత్వపున్ లతల పాదుల కెందరొ నీరు పోయ,పుం
భావ సరస్వతుల్ ఘనుల ,ప్రాజ్ఞుల,ఆలన పాలనన్,కమ్మనౌ
తావులునల్దెసల్ గురిసె దండిగ తొల్లి దినాల,ఆ పయిన్
"బావ "లు,అక్కలున్,సకల బంధులు పెంచిరి దీనినిమ్ముగాన్!

బావ అంటే ("బాపి బావ")
అని .....ఒకానొక సందర్భంలో భావ కవిత్వం గూర్చి అన్నాను ...అదిగో ...

ఏనదె గంటి నా కవుల ఇంపగు ఛాయలు ,నీదు కైతలన్;
వాణి కృపా కటాక్షము ,అపారము నీకది నిక్క మిద్ది ,నీ
వైనము ,భావ పుష్టి కడు ప్రస్తుతి పాత్రము "తుర్ల పాటి ,రా
మానుజ"!మిత్రమా వరలుమా ధర నిట్టులె నూర్వసంతముల్!

"సుందర రామానుజ"!కవి
బృంద మ్ముల నిశ్చయముగ ఈడ్యుడ వేరా!
విందొన గూర్చెను నీ పద
బంధమ్ములు శైలి ,భాష ,వన్నియ లెల్లన్ ! "

తదుపరి, అంతకు ముందు రోజు మరణించిన శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి సంతాపముగా సభ ఒక నిమిషము మౌనము పాటించినది. సోమసుందర్ గారి గురించి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ చేసిన ప్రసంగము: "కవి లోకం అంతా గౌరవించే ఒక దూత రాలిపోయారు. ఆధునిక కవులలో ఆయన అందరికంటే పెద్దవారు. ఆయనది అభ్యుదయ కవిత్వం. శ్రీ శ్రీ గారి తర్వాత ఒక గొప్ప అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ గారు. వారి వజ్రాయుధం ఒక దూకుతున్న జలపాతం. ఆయన రాసిన వృత్త ఛందస్సులో ఒక గొప్ప ప్రయోగం శ్రీ వృత్తం. ఎమర్జన్సీ ని మొదటిలో సమర్ధించటం వలన ఆయన ప్రభావం కొంత తగ్గింది. కానీ గొప్ప సృష్టి యొక్క ప్రభ తగ్గదు. ఆయనకి విజ్ఞాన ట్రస్టు వారి పురస్కారం, సోవియట్‌లాండ్ వారి పురస్కారం మొదలైనవి లభించినాయి. వజ్రాయుధం కవి వెళ్లిపోయారు కాని వజ్రాయుధం ఎప్పుడూ ఉంటుంది. తరువాత శ్రీ ఆవంత్స సోమసుందర్ తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని తల్చుకుంటూ డా కె.గీత ఎప్పుడూ ఎంతో ఆత్మీయంగా "అమ్మాయ్ గీతా " అని పిలిచే ఆత్మీయ పిలుపుని కోల్పోయానని అన్నారు. తన కవిత్వాన్ని చదివి ఆయన ఎంతో మెచ్చుకునే వారని గుర్తు చేసుకున్నారు. సభకు వారి వజ్రాయుధం నించి తోలి కవితను చదివి వినిపించారు.

ఆ తరువాతి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. వీక్షణం సమావేశంలో అందరూ ఎదురు చూసే తెలుగు జిమ్నాస్టిక్స్ ప్రక్రియ.

కవి సమ్మేళనం లోని కవితలు:

1. రామానుజా రావు గారు: యోసమైటీ, ఉదయాన్నే వెలసిన వర్షం

2. శ్రీ చరణ్ గారు: కృష్ణా పుష్కరాలు, ఆంజనేయ స్వామి మీద పద్య కవిత్వం

3. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు: తమ కృత్తివాస శతకము నుండి చదివిన పద్యములు - జ్ఞానమటన్న, అంబకు పాదదాసుడు మొదలైన పద్యములు

4. వేణు ఆసూరి గారు పాడిన మహాభారతములోని పద్యాలు - తనయుల వినిచిదెవో, కుప్పించి యెగసిన

5. కె. గీత గారు: "జాబిల్లి చేవ్రాలు" కవిత

తరువాతి కార్యక్రమం అన్నే లెనిన్ గారు రచనల్లో "ఆత్మ" గురించి మాట్లాడుతూ "ఆత్మ అనేది అర్ధం అవుతున్నట్లుంటుంది, కానీ అర్ధం కాదు. ఉదాహరణకు అక్కిరాజు రమాపతి గారి కథ లో ఒక దూర ప్రాంతములో ఉంటున్న తండ్రి కూతుళ్ల ఆత్మ ఘర్షణ" అన్నారు.

చివరిగా వేమూరి వేంకటేశ్వర రావు గారు వీక్షణం కార్యక్రమాలు మెరుగు పరచటానికి అభిప్రాయ సేకరణ చేసారు. సభలోని వారు వీక్షణం నిర్విరామముగా, చక్కగా జరగడానికి ముఖ్య కారణమైన అందరికీ అభినందనలు తెలియజేసారు. అమెరికాలో వీక్షణం వంటి తెలుగు సాహిత్య సభ జరగటము, ఆ మూడు గంటలు మనకి ఇష్టమైన మనుష్యల మధ్య హాయిగా జరగటము ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అంతా అన్నారు. వీక్షణములో ఒకే విషయంపై లోతుగానూ, దీర్ఘముగానూ చర్చిస్తే బాగుంటుందని, యువతకు, బాలలకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి పెంపొందించి, వీక్షణము వంటి సభలలో పాల్గొనటము చేస్తే, ఆ తరువాతి తరానికి చెందిని సాహిత్యానికి పునాదులు చేకూరతాయని వచ్చిన సలహాలను తప్పక పాటిస్తామని డా కె.గీత హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ నెల 11 న, రెండవ ఆదివారం నాడు జరగబోయే వీక్షణం నాలుగవ వార్షిక సమావేశాన్ని అంతా జయప్రదం చేయవలసిందిగా కోరారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)