తెలుగు తేజో మూర్తులు : భారత క్రికెట్ పితామహ - క్రికెట్ కింగ్ (సి కె) నాయుడు

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

భారత దేశానికి ఇంకా స్వాతంత్రం లభించని రోజులవి. తెల్ల దొరలు రాజ్యమేలుతున్నారు. ఇలాంటి సమయంలో సి కె నాయుడు (సి కె) తన అద్బుత క్రికెట్ బ్యాటింగ్ కౌశలంతో అందరిని ఆకట్టుకుని, తెల్ల వాళ్ళతో పొరాడ డానికి సంసిద్ధుడై నిలవటమే కాక, హిందూస్ జట్టుకు నాయకత్వం వహించి క్రికెట్ దిగ్గజం ఎం సి సి జట్టుతో ధైర్యంగా తలపడి, నిలచి, అందరి మన్ననలు ఆకట్టుకుని, ధైర్య సాహసాలను, నిపుణతను పరిచయంచేస్తూ, భారత దేశ క్రికెట్ భవిష్యత్తుకు పునాది వేసిన భారతీయుడు, తెలుగు బిడ్డ, భారత క్రికెట్ పితామహుడు, కలనల్ కొట్టారి కనకయ్య నాయుడు (సి కె). క్రికెట్ పరిభాషలో ఈయన్ని క్రికెట్ కింగ్ (సి కె) గా వ్యాఖ్యానిస్తారు.

సి కె:


- భారత దేశం క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సి కె.
- తొలి పరుగులు సిక్సర్ తో ప్రారంభం
- తొలి సారి భారత ప్రభుత్వ "పద్మ భుషణ్" పురస్కారం (1956)అందుకున్న ఓ భారతీయ క్రికెట్ ఆటగాడన్న ఘనత కూడా సి కె దే.
- యవ్వరు బద్దలు కొట్టని ఇంకొక రికార్డ్ - బ్రిటెన్ లో ఒక్క సీజన్ (కాలం) లో 32 సిక్సర్లు కొట్టిన ఘన కీర్తి కూడా సి కె దే.
- విస్డెన్ 'క్రికెటర్ ఆఫ్ ధి ఇయర్ ' (1933) జాబితాలోని తొలి భారతీయుడు

సి.కె. కు నాయకత్వపు లక్షణాలు చిన్నప్పటినుంచి ఉండేవి. స్కూల్లో క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా ఉండి, క్రమేపి యెదిగి భారత క్రికెట్ జట్టుకు ప్రప్రదమ కెప్టెన్ గా సారధ్యం వహించారు.

భారత జట్టు, బ్రిటెన్ లో తొలి సీరీస్ ఆడినప్పుడు, కలనల్ కొట్టారి కనకయ్య నాయుడు, 26 మ్యాచులలో 1618 పరుగులు సాధించారు. అంతే కాదు 65 వికెట్లు కూడా పడగొట్టి, తన కౌశలం, నాయకత్వం పరిచయం చేయడమేకాక, సర్వతోముఖ నైపుణ్యాన్ని చూపించారు. వార్విక్ షైర్ లో ఆడుతున్న మ్యాచ్‌లో భారి సిక్స్ కొట్టే సరికి అది పక్కనున్న నదిలో పడింది. అది పక్క కౌంటీ కాబోలు, "సి కే కొట్టిన సిక్స్ వార్విక్ షైర్ నుంచి వొర్చెస్టర్ షైర్ లో పడింది" అని ఓ ఆంగ్ల పత్రికలో వ్రాసేరు. అలాంటి వీరంగం ఆంగ్లేయులకు చవి చూపెట్టిన ప్రప్రధమ భారతీయుడు సి కె.

తాను ఆడిన మొట్ట మొదటి ఓవర్ నాలుగో బంతిని సిక్సర్ కొట్టేడు. అంతే! ఇక ఆ ముద్ర చెరగ లేదు. సి కె అంటే ఇక వేరే చెప్పనక్కర లేదు. బంతి ఉన్నది కొట్టడానికే అన్న దృష్టి కలిగి ఉండి, అచిరకాలం అలానే ఆడేరు. ప్రజల మనసుల్లో చెరగని ముద్రై నిలచి పోయేరు.

సి కె ఆజానుబాహుడు. మంచి స్పుర ద్రూపి. ఆరు అడుగులు యెత్తు, మంచి క్రమశిక్షణ కలవాడు, బరిలోకి దిగాడంటే మెరుపు తీగ లాగ ఉండేవారు. ఆర్మీ లో మాదిరిగా జట్టుని క్రమశిక్షణతో నడుపుతూ, యవ్వరికి ఇబ్బంది కలుగకుండా అన్నీ చూసుకునేవారు. పాటవం, కుశలత, అక్రమణా దృక్పధం, చురుకుదనం రంగరించినవారు సి కె.

ఆ రోజులలో క్రికెట్ ఆటలో కవచ ధారణలు లేవు. బంతి మీద చూపు కను రెప్ప పాటు లేక పోయినా కష్టమే. వంటికి తాకిందో గాయ పరిచేది (కంకి కట్టేది). ఓ బౌన్సర్ వేస్తే, దాన్ని బౌండరికో, లేక బౌండరీ పైకో పంపించాలి అన్న దృక్పధంతో ఉండి బంతిని "చితక బాదేవారు " సి కె. బరిలో దిగిన తరువాత దేనికి వెరిచేవారు కాదు. ఈ లక్షణం ఆడినంత కాలం మారలేదు. అందుకే అంత ఆరితేరిన మేటి బ్యాట్స్‌మన్ గా పేరొందేరు. ప్రత్యర్ధి బౌలర్లు కూడా ఎంతో గౌరవంతో చూసే వారు. నాటి మేటి బౌలర్ డి ఆర్ జార్డైన్ సి కె ని వూలీ తో పోలుస్తూ, క్రికెట్ ఆటలో ఉన్న ప్రతీ షాట్ కి "మాస్టర్" అని అభివర్ణించాడు.

పరుగుల ప్రభంజనం

అది హిందువులు - తెల్ల దొరలు (ఎం సి సి) క్రికెట్ జట్టు మధ్య పోటి.
ఈ భరత సింఘం, తెల్ల దొరలతో ఆడుతున్న ఆటలో చెలరేగింది. ఈ మేటి బ్యాటింగ్ వీరుడికి, బొత్తిగా భయంలేదు. ఇక చెప్పేదేముంది - అత్యద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ, నూట యాబై మూడు పరుగులు రమా రమి నూట పదహారు నిమిషాలో (అంటే రెండు గంటలలోపే) కొట్టేసాడు. ముంబాయి జింఖాన మైదనాన్ని హోరెత్తించాడు. మొత్తం జట్టు పరుగులు (స్కోరు) 187 ఐతే సి కె వంతు 153 పరుగులు. బంతి ఉన్నది కొట్టటానికే అని సి కె దృక్పధానికి ఇది చక్కటి ఉదాహరణ. ఫీల్డింగ్ లో దిట్ట. చురుకుదనంతో ఉండేవారు. జట్టులో క్రమశిక్షణ నెలకొల్పేవారు. మిలటరీ లో కలొనల్ గా పనిచెసేవారు మరి!. బాగా అడే వాళ్ళని ఇట్టే పసిగట్టి, ప్రజ్ఞా పాటవాలని ప్రోత్సహించేవారు. ఈ ధోరణే, మేటి ఆటగాళ్ళని భారత క్రికెట్ భవిషత్ తరానికి అంధించగలిగింది.

చివరి దాకా....ఆటే..

క్రికెట్ ఆడుతూ ఆరు పదుళు నిండినవారు అరుదు. సి కె అక్షరాలా అరవై యేళ్ళ పాటు క్రికెట్ ఆడుతూ వచ్చేరు. సి కె చివరి ఆట - అరవైరెండవ యేట, రంజి ట్రోఫీ (1956-57) ఉత్తర్ ప్రదేశ్ జట్టుకి ఆడుతూ యాభై రెండు పరుగులు సాదించేసి ప్రదమ శ్రేణి క్రికెట్ నుంచి విరమించేరు. షష్టిపూర్తి మహోత్సవం కూడా జరుపుకుని ఆటలో పాల్గొనే వారు ఇక కంటబడటం దుర్లభమే.

"తెలుగు వాడు తెలుగు నేల వదిలి వెళ్ళేడంటే వీరుడే అవుతాడు" అని సెలవిచ్చారు కృష్ణా జి. ఆ మాటే రుజువైయ్యింది మరోసారి "సి కె" విషయంలో. మధ్య ప్రదేశ్ లో క్రికెట్ జీవితం ప్రారంభించి భారత, ఆంధ్ర, మధ్య భారత్, సెంట్రల్ ప్రావిన్సెస్, హిందూ, హోల్కర్, హైదరాబాదు, రాజ్పుటాన, యునైటెడ్ ప్రావిన్సెస్ జట్టులకు ఆడేరు. చిట్ట చివరి సారిగా 1963-64 లో తన అరవై యెనిమిదవ యేట ఓ చారిటి మేచ్ లో మహారష్ట్ర గవర్నర్ జట్టులో ఆడేరు. నవంబరు 1967 లో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో స్వర్గస్తులైనారు సి కె గారు.

అగ్రశ్రేణి ఆటలలో "సి కె" కనపరచిన పరాకాష్ట

1916/17 లో మొదలైన ఆటల జీవితం, 1963-64 వరకు కొనసాగింది. ఇంత సుగీర్గ కాలం ఆడిన ఉదాహరణలు వెరే యవరివీ లేవు. అగ్రశ్రేణి క్రికెట్ లో నాలుగు వందలకు పైగా వికెట్లు సాదించారు.

"సి కె" క్రికెట్ జీవిత విషయ సారంశం:

ఆడిన ఆటలు - 207
చేసిన పరుగులు - 11,825
అత్యుత్తమ పరుగులు (స్కోరు) - 200
సెంచరీలు - 26
యాబైలు - 28
తీసిన వికెట్లు - 411
పట్టిన క్యాచ్ లు - 170

ప్రముఖ క్రికెట్ ఆటగాడు ముష్తాక్ అలి సి కె ని "షహెన్షా" (రాజాధి-రాజు) గా వర్ణించాడు. సి జి మెకార్ట్ని, సి కె ఓ అద్బుత, పరాక్రమ, అగ్రగామి బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. జే బి హోబ్స్ సి కె పుట్టుకతోనే గొప్ప ఆటగాడు అని పేర్కొన్నారు.

సి కె జ్ఞాపకార్ధం ....


- భారత క్రికెట్ జట్టుకు మొట్టమొదటి నాయకుడై, ఈ ఆటను భారత జన హృదయాలలో హత్తుకుపొయేటట్టుగా ఆడి, దాని అభివృద్దికి పట్టు కొమ్మై నిలచిన ఈ మేటి క్రికెటర్ పేరున సి కె నాయుడు క్రికెట్ టోర్నమెంట్ యేటా నిర్వహిస్తున్నారు.

- ప్రతిష్టాత్మక సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నెలకొల్పి, ఐదు లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో మన్సూర్ అలి ఖాన్ పటౌడి, నింబాల్కర్, చందూ బొర్డే, భగవత్ చంద్రశేఖర్, వెంకటరాఘవన్, బిషన్ సింగ్ బేడి, ఎరపల్లి ప్రసన్న వంటి మేటి ఆటగాళ్ళు ఉన్నారు.

సి కె జ్ఞాపకార్ధం, భారత ప్రభుత్వ తంతి తపాల శాఖ సి కె తపాల బిళ్ళను 1995 లో వెలువడించి గౌరవించింది.

"సి కె" మీద వెలువడిన కొన్ని పుస్తకాలు:

- సి కె నాయుడు - లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైం, ఎల్ ఎన్ మాతుర్

- సి కె నాయుడు, ఏ డాటర్ రిమెంబర్స్, చంద్రా నాయుడు

కలనల్ కొట్టారి కనకైయ్య నాయుడు భారత క్రికెట్ చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాయించుకోవటమే కాక, తన వీరంగంతో అభిమానులను ఆకట్టుకుని, క్రికెట్ ఆట భారత జన జీవితాలలో అంతర్భాగం అవ్వడానికి కారణభూతుడైయ్యేరు. ఈ తెలుగు తేజోమూర్తి - భారత క్రికెట్ పితామహుడు. రానున్న తరాలవారికి స్పూర్తిగా, ఆదర్శ పురుషుడిగా మూర్తీభవించేడు.