సారస్వతం
సద్గురువాణి
- సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్

మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏం తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే. ఆరోగ్యంగా తినటానికి ఇక్కడ మీకు 5 సులువైన ఆహార చిట్కాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి తను తినే ఆహారం నుండీ వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందేందుకు ఈ చిట్కాలు సాయం చేస్తాయి.

1: ఎంత తినాలి ?

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచేస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ‘ఘ్రెలిన్’ అనే హర్మోన్ ఉత్పత్తి చేస్తుందని, అది కడుపుకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ హార్మోన్ అనేక ఇతర పనులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మనం నేర్చుకోవడానికి, జ్ఞాపక శక్తికి, మనమున్న ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను, మన మెదడులో చక్కబెట్టే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామార్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, చలాకీగా, ఏకాగ్రతతో ఉంటాం. అయితే మనం తినడం మానేయాలని కాదు, కానీ మనమెంత తింటున్నామన్న విషయంపట్ల జాగ్రత్తగా ఉండాలన్న సంగతి ఇది చెబుతోంది. మనం స్వీకరించే ఆహరం సరైన విధానంలో ఉంటే మన రోజుని ఎంత ఉత్తమంగా తయారవుతుదన్న విషయంపై సద్గురు విశదీకరిస్తారు.

“మీరు రోజంతా తింటూ ఉండకూడదు. మీరు ముప్ఫై ఏళ్ళ లోపు వారైతే, రోజుకు మూడు పూటలా తినడం మీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. అదే మీకు ముప్ఫై పైబడి ఉంటే, ఆహారాన్ని రోజుకు రెండు పూటలకే తగ్గించడం ఉత్తమం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మన తనువు, మనుసు అత్యుత్తమంగా పనిచేస్తాయి. తిన్నది రెండున్నర గంటల్లో ఉదరకోశం నుంచి వెళ్లిపోయేలా, 12-18 గంటల్లో మీ శరీరాన్నే వదిలిపోయేలా ఉండే ఆహరం ఎరుకతో తీసుకోండి. ఈ మామూలు విషయాలు మీ ఎరుకలో నిలుపుకుంటే, మీరు మరింత శక్తిని, చలాకీతనాన్ని చురుకుదనాన్ని, అనుభూతి చెందుతారు.” – సద్గురు

2 : ఎలా నమలాలి?

ఆహారాన్ని నమలడమనేది జీర్ణప్రక్రియలో ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు, లాలాజలం ద్వారానే 30 శాతం జీర్ణం అవుతాయి. ఆహారం తీసుకున్న తరువాత, నిద్రకు ఉపక్రమించేందుకు, కనీసం రెండు గంటల వ్యవధినివ్వండి. జీర్ణప్రక్రియ మీ జీవక్రియను ఉత్తేజితం చేస్తుంది కాబట్టి, అలాంటి స్థితిలో మీరు నిద్రపోతే, అటు మీకు నిద్రా సరిగ్గా పట్టదు, ఇటు ఆహారం జీర్ణమూ సరిగ్గా అవ్వదు! తిన్నవెంటనే మీరు నిద్రపోతే, మీరు తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం జీర్ణమవ్వకుండా ఉండి పోతుంది.
సద్గురు మీకు ఆహారాన్ని నమలడమనే విషయంపై యోగ దృష్టికోణాన్ని అందిస్తున్నారు.

“యోగాలో ఏమంటామంటే, ‘మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలని’. దీని వెనక ఎంతో శాస్త్రం ఉంది. ముఖ్యమైన విషయమేమిటంటే, మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే, అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొడితనాన్నిసృష్టించదు. మరొక విషయమేమిటంటే, మీరు తిన్నదాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహరం యొక్క సమాచారం మీ శారీరిక వ్యవస్థలో స్థాపితమవుతుంది. మీ శరీరంలోని ప్రతీ అణువు మీకు ఏది సరైనదో ఏది సరైంది కాదో తీర్మానించడం మొదలుపెడుతుంది – అంటే కేవలం నాలుక విషయంలోనే కాదు, మొత్తం వ్యవస్థ విషయంలో ఇలా జరుగుతుంది. మీరిది కొంత కాలం పాటూ చేస్తే, మీ శరీరంలోని ప్రతీ అణువుకు దానికేది ఇష్టమో, అయిష్టమో అన్న విషయంపై అవాగాహన ఏర్పడుతుంది.” – సద్గురు

భోజనం చేసేటప్పుడు నీరు త్రాగడం మంచిది కాదు. కావాలంటే భోజనానికి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా నీరు తాగండి లేదా భోంచేసిన 30 లేదా 40 నిమిషాల తరువాత తీసుకోవడం మంచిది. రాత్రి వేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తివంతం చేస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయూ)లలో జరిపిన పరీక్షలలో, రాగి పాత్రలు ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే బ్యాక్టీరియాని 97 % నాశనం చేస్తాయని తేలింది.

3: ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి?

వివిధ ఋతువులలో వివిధ రకాల ఆహారాన్ని తీసుకునే సాంప్రదాయంపై, మారే వాతావరణాన్ని మన శరీరం తట్టుకునేందుకు సహకరించే ఈ పధ్ధతిపై సద్గురు మరింత విపులంగా చెబుతున్నారు.

“ భారత దేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో, వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే, శరీరానికి సరిపడే కూరగాయలతో వండుతారు. ఈ వివేకంతో మన శరీర అవసరాలకు తగ్గట్టుగా, మారే వాతావరణానికి అనుగుణంగా తినడం మంచిది.

ఉదాహరణకి చలికాలంలో, గోధుమ, నువ్వుల్లాంటి కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ కాలంలో, వాతావరణం చల్లబడటం వల్ల చర్మం పగులుతుంది. అయితే పూర్వం ప్రజలు క్రీములు మొదలైనవాటిని వాడేవాళ్ళు కాదు. అందరూ రోజూ నువ్వులని తీసుకునేవారు. అవి ఒంటిని వేడిగా, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మీ శరీరంలో ఉష్ణం ఎక్కువ ఉండటం వల్ల, మీ చర్మం పగలదు. అదే, ఎండాకాలంలో శరీరం వేడెక్కుతుంది. కాబట్టి, శరీరాన్నిచల్లబరిచే (చల్లనివి కాదు)ఆహారాలు తీసుకునేవాళ్ళు. ఉదాహరణకి, జొన్నలు తీసుకుంటారు. శరీరం తనను తాను ఆ ఋతువుకి అనుగుణంగా మలుచుకునేందుకు ఈ విషయాలను నిర్ధారించారు.” – సద్గురు

4: సమతుల ఆహారం అంటే ఏమిటి?

సద్గురు తగినన్ని కూరగాయలని, పప్పు దినుసులని, వివిధ రకాలైన ధాన్యాలని ఆహారంలోకి తేవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తారు.

“ ఈ రోజున, డాక్టర్లు దాదాపు 8 కోట్ల మంది భారతీయులు మధుమేహ వ్యాధి వైపుగా వెళుతున్నారని చెబుతున్నారు. దీనికి గల ఒకానొక కారణం, చాలా మంది భారతీయులు ఒక రకం ధాన్యంతో చేసిన ఆహారాన్నే తీసుకోవడం. ప్రజలు కేవలం బియ్యాన్నో లేదా కేవలం గోధుమనో తింటున్నారు. దీనివల్ల తప్పకుండా ఆరోగ్య సమస్యలేర్పడుతాయి. అందుకని మన జీవితంలోకి విభిన్న రకాల ధాన్యపు ఆహారాన్ని తీసుకురావడం చాలా ముఖ్యం.

సాంప్రదాయంగా, ప్రజలు చాలా రకాల పప్పు దినుసులని, రకరకాల ధాన్యాలని తినేవారు. కానీ మెల్లగా ఇవి కనుమరుగైపోయాయి, ఈకాలంలో దక్షిణభారతంలో ఆహారాన్ని చూస్తే, అందులో ఎక్కువగా అన్నం, కొద్దిగా కూరగాయలతో చేసినదేదైనా ఉంటుంది. ఇదొక తీవ్రమైన సమస్య. పూర్తిగా కార్బోహైడ్రేట్లు ఉండే ఇలాంటి ఆహారానికి మారడం గత ఇరవై ఐదు, ముప్ఫై ఏళ్ళలో జరిగింది. దీన్నిప్పుడు వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండి మిగతావి తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, ఒక వ్యక్తి దీర్ఘ కాలిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆహారంలో ఎక్కువ భాగం కేవలం అన్నమే ఉండకూడదు, మిగతావి కూడా ఉండాలి. అన్నమనేది మీ ఎంపిక మాత్రమే – అది తినాలా వద్దా అనే విషయాన్ని మీరు మీ ఆకలి స్థాయిని బట్టి నిర్ణయించుకోండి. ఇది ప్రజల మనస్సులో ఏర్పరచ వల్సిన ఒక మౌలికమైన భావన.” – సద్గురు

5 : మంచి ఆహారపు అంటే ఏమిటి?

ఆహారం శరీరానికి సంబంధించినదని, దాని విషయంగా నిర్ణయించాలనుకుంటే శరీరాన్ని అడగటమే ఉత్తమమైన మార్గమని సద్గురు మనకు గుర్తు చేస్తారు. ఒక మూస ప్రకారం మనల్ని ప్రవర్తింపచేసే ఆహారపు అలవాట్లని పెంచుకోవడం కంటే, మన తెలివిని ఉపయోగించి మన ఆహారంపై నిర్ణయించుకోవడం మంచిది.

సూచన: ఈ సాధారణ గైడ్ లైన్స్ చాలా మంది ప్రజలకి వర్తించినా, ప్రతీ ఒక్కరి శరీరం ప్రత్యేకమైనది. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారు తమ ఆహరంలో మార్పులు చేసేముందు ఒక వైద్యుణ్ణి కలవండి.
మీరు మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార విషయాలకై చూస్తుంటే, మా ప్రజాదరణ పొందిన “ఫుడ్స్ యూ షుడ్ అవాయిడ్” బ్లాగ్ స్పాట్ ని సందర్శించండి. మీరు ఈశా వారి తాజా ఈ-బుక్లెట్ “ఫుడ్ బాడీ” ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బుక్లెట్ శరీరం హాయిగా స్వీకరించగలిగే ఆహార రకాలను, అలాంటి వాటిని స్వీకరించాల్సిన సరైన మార్గాలని పరిశోధిస్తుంది. ఈ 33 పేజీల బుక్లెట్ మీ శరీరం గురించి తెలుసుకోవడానికి, మీకేది ఉత్తమమైనదో తెలుసుకోవడానికి మొదటి మెట్టు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)