కబుర్లు

వీక్షణం సాహితీ సమావేశం-30

-

ఈ నెల వీక్షణం సాహితీ సమావేశం తాటిపామల మృత్యంజయుడు గారింట్లో ఫిబ్రవరి 15న జరిగింది. ఈ సమావేశానికి మృత్యుంజయుడు గారే అధ్యక్షత వహిస్తూ అందరికీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారిని కథా రచన విశ్లేషణ, స్వీయ కథా పఠనం చేయమని అహ్వానించారు. కె. వరలక్ష్మి మాట్లాడుతూ తన కథల్లో పాత్రలన్నీ తను పుట్టి పెరిగిన ఊరులో చుట్టూ నిత్యం కనిపించేవే అన్నారు. మొదటి కథ "గాజు పళ్లెం" గురించి మాట్లాడుతూ ఆ కథ రంజని అవార్డు పొందిందని, అనేక సంకలనాల్లో చోటు చేసుకుందని చెప్పారు. ఇదొక పల్లెటూరి అమ్మాయి కథ.



ఆ తర్వాత నించి రాసిన అనేక కథలకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయని చెప్తూ తన కథల్లోని కొన్నిటి ఇతివృత్తాలను, కథా సంవిధానాన్ని వివరించారు. మంత్రసాని కథ గురించి చెప్తూ ఒకప్పుడు పురుడు పోసే ఎరుకల సాని జీవన విధానాన్ని, అన్యాయాల్ని వివరించారు.

ఇటీవల రాసిన "ఆ నాటి వాన చినుకులు" కథలో ఎప్పుడో విడిపోయిన ప్రేమికుల కథ ద్వారా జ్ఞాపకాల్ని పదిల పరుచుకోవడమే ఆనందదాయకమనే విషయాన్ని చెప్పారు. కథలకు ముగింపు విషయాలు చెప్తూ ఒక్కోసారి ముగింపు ముందే తడుతుందని, ఒక్కోసారి ముగింపు కోసం చాలా రోజులు ఆలోచనల్లో గడపాల్సి వస్తుందని అన్నారు.


స్త్రీలకు సమాజం అంతా శత్రువే అన్నారు. చేరా తనని ఉద్దేశించి.. "స్త్రీల సమస్యల గురించి పట్టించుకోవడమే కాదు, ముఖ్యంగా గ్రామీణ స్త్రీల గురించి రాసిన ఏకైక స్త్రీ వాద కథా రచయిత్రి అని" పేర్కొన్నారని అన్నారు. అందుకు ఉదాహరణగా "సువాసినీ పూజ" కథను వివరించారు.

గ్రామీణ నేపథ్యంలో మట్టి, బంగారంతో సమానమయ్యే ఘటనల్ని వివరించే "మట్టి బంగారం' కథ, ఇప్పటి ప్రపంచంలో మనిషి ఇమడలేక పోవడాన్ని వివరించే "కలకానిది విలువైనది" కథలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరగా వారి కుమార్తె డా|| కె.గీత కథా చదివిన వరలక్ష్మి గారి కథ "శివంగి" అంతర్జాతీయ స్థాయి కథ అని సభలో అందరూ కొనియాడారు.


ఆ తర్వాత వరలక్ష్మి గారి నాలుగవ కథా సంపుటి "క్షతగాత్ర" పుస్తకాన్ని శ్రీమతి గునుపూడి అపర్ణ ఆవిష్కరించగా, శ్రీ మృత్యుంజయుడు కథా పరిచయం చేసారు.

చక్కని విందు భోజనపు విరామం తర్వాత కవి సమ్మేళనంలో శ్రీ వేణు ఆసూరి అంతర్జాతీయ సమస్యను సున్నిత బంధాలతో పోలుస్తూ కవితను చదవగా, డా|| కె.గీత " మా మధ్య వేలైంటైన్స్ డే " కవితను వినిపించారు.

శ్రీ లెనిన్ మహా భారత తత్త్వ వివేచన మరో పది నిమిషాలు సాగిన తర్వాత, శ్రీ కిరణ్ ప్రభ జనరంజకంగా క్విజ్ నిర్వహించడమే కాకుండా, అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తూ శరత్ బాబు జీవితాన్ని గురించి అత్యంత ఆసక్తి దాయకంగా వివరించారు. అత్యంత కష్టాలతో గడిచిన శరత్ బాల్యం, యౌవనం, జీవితంలో అన్నీ కోల్పోయిన అభాగ్యుడిగా మిగిల్చిన విధి వంచన, తిరిగి కథా రచయితగా ఆయన నిలదొక్కుకోవడం,
అత్యంత స్ఫూర్తిదాయకమైన రచయితగా మహా నిష్క్రమణను వివరించారు.

ఈ సభకు శ్రీమతి శారద, శ్రీ నరసింహారావు, శ్రీమతి జయమాల, శ్రీమతి మృదుపాణి, శ్రీమతి స్వప్న, మొదలైన వారు హాజరై సభను జయప్రదం చేసారు.

చివరగా ఇటీవల దివంగతులైన ప్రసిద్ధ నవలా రచయిత శ్రీ కె. కేశవరెడ్డి గారికి నివాళి అర్పించి సభను ముగించారు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)