ఇలా వసంతము, గ్రీష్మము, వర్ష, శరత్, హేమంతము,
శిశిరము వాని వాని మాసములలో కాక ఒక నెల
ఆలస్యముగా ప్రారంభమయ్యాయి. సమయము గడిచింది.
మరల 32 మాసములు పూర్తయ్యాయి. ఈ సారి ఈ ఋతువులు
ఇంకో నెల వెనక్కు వచ్చాయి. అంటే మనము లెక్క
పెట్టే ఋతువులు మరియు ప్రకృతిలో వాని
స్వభావసిద్ధమయిన కాలమునకు రెండు నెలల తేడా
వచ్చింది. కొంతకాలమునకు మనము చెప్పుకునే వసంత
ఋతువులో వానలు పడడము మొదలయితే ఒకానొక సమయము
వచ్చేసరికి చలి పుట్టించవలసిన హేమంతములో
రోల్లు బద్దలయ్యే ఎండలు వచ్చాయి.
అంటే..?
అంటే మనము ప్రకృతి
నుండి విడిపోయాము. ప్రకృతి దాని దారిలో
పోతోంది మనము మన దారిలో పోతున్నాము.
దాని వలన మనకు నష్టమేమిటి?
వసంత ఋతువు ప్రారంభము అయ్యింది. నవరసాలు
కలిపిన ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తాము. దాని
లోని ఔషధ గుణములు ఎవరికీ వివరించి
చెప్పక్కరలేదు. ఇది ఒక సంప్రదాయముగా
భావిద్దాము. ఆ సంప్రదాయమును పాటించాలంటే మనము
మామిడి, వేప మరియు చింత చెట్లు, చెఱుకు తోటలు,
అఱటి వనములు పెంచ వలసినదే. లేదా వాని
పెంపకమును ప్రోత్సహించవలసినదే. శ్రీరామనవమికి
బెల్లపు పానకము అందులో మిరియాలు. అలాగే అక్ష
తదియ, శ్రావణపున్నమి, వినాయకచవితి, రథసప్తమి,
మహాళయము, శరన్నవరాత్రులు, దీపావళి, కార్తీక
పున్నమి, భోగి, మకర సంక్రాంతి, మహా శివరాత్రి,
వసంతోత్సవము, హోళీ పండుగలు. ఈ పండుగలన్నీ
ప్రకృతితో ప్రత్యక్ష సంబంధమున్నవి. వీనిలో
దేనినీ మనము ఊహించి చెయ్యలేము.
మనకు వచ్చే నష్టము
మనము ఊహించిన కొత్త పద్ధతితో మనము వాడుకునే
ఋతువులు మరియు మనము ఎదురుగా చూస్తున్న ప్రకృతి
వేరు వేరుగా కనిపించడము మొదలయ్యింది. మనము
అనుకున్న కాలములో ఆయా వస్తువులు దొరకనందున
క్రమముగా సంప్రదాయము కనుమరుగయ్యింది.
సంప్రదాయము ముసుగులో మనము కాపాడుకుంటూ వచ్చిన
మన ఆరోగ్యము మరియు ప్రకృతి
యొక్క ఆరోగ్యము కూడా క్షీణించడము మొదలయ్యింది.
మన ఊహలకు అతీతమయిన ప్రకృతి ఇపుడు అంచనా
వేయలేని స్థాయికి వెళ్లి పోయింది. ప్రకృతిలో
మార్పుతో మనలో వచ్చే మార్పులను ముందే
ఊహించగలిగే అవకాశము చేజారినది. ప్రకృతితో ఉన్న
అవినాభావ
సంబంధమును మనకు గుర్తు చేసి ప్రకృతికి
అనుకూలముగా మనను నడిపే సంస్కారములు
కనుమరుగయ్యాయి.
ఫలితంగా...
1.
పంచదార మరియు బెల్లము బదులు తీపి లేని తీపి
వాడుతున్నాము.(Sugar
free sugar).
చక్కెర కర్మాగారములు మూత పడ్డాయి. పంచదార
మరియు బెల్లము ఎలా ఉంటాయో మనకు తెలియదు.
చెఱుకుగడ అనే పదము మెల్లగా వాడుకలో
నుండి మాయమవుతుంది. తీపి తినకపోయినా తీపిరోగము
పిల్లా పెద్దా అందరినీ వరిస్తుంది.
2.
అశోక వృక్షమునకు పూలు వసంత ఋతువులో పూస్తాయి.
అవి ఎఱుపు పసుపు రంగుల మిశ్రమములో ఉంటాయి. ఇవి
వసంత
ఋతువులో మాత్రమే కనబడతాయి. మనము చూడని ఆ
వృక్షమును మనము గమనించేదెలా?
ఇప్పటికే కనుమరుగయిన ఈ వృక్షము ఇంక
అంతరిస్తుంది.
3.
పారిజాతము, అర్కపత్రము, కపిత్థము(వెలగ),
జంబూకము(నెఱేడు), అశ్వత్థము, బిల్వము, పలాశ
(మోదుగ) ఇలా వందలాది ఔషధగుణములున్న వేలాది
వృక్ష
సంపదతో ముడి పడి ఉన్న మన సంస్కృతి
కనుమరుగవుతుంది.
4.
అతి ఔషధయుక్తమైనది నూపురమున్న మన దేశపు ఆవు.
మన చుట్టు పక్కల అది సంచరిస్తే చాలు మనము
ఆరోగ్యముతో ఉంటాము. మన సంప్రదాయములతో మనకు
దూరము పెరిగే కొద్దీ దాని విలువ మన దృష్టిలో
తగ్గడము ప్రారంభిస్తుంది.
5.
ఆరోగ్యకరములైన వృక్షసంపద పశుసంపద నశిస్తుంది.
వాతానుకూల
గృహములలో నివశించే కొత్త సంస్కృతి మనను
నిస్తేజులను చేస్తుంది. పూజలు నిరర్థకములుగా
కనిపిస్తాయి. వేకువ ఝామునే నిద్ర లేవాలన్న
వాదన తర్క హీనము
(illogical)
గా కనిపిస్తుంది.
6.
అతి సున్నితముగా తయారయిన మన శరీరమును మరియు
వాతావరణమును వరించడానికి ఎయిడ్స్, ఫ్లూ,
మస్తిష్క జ్వరము, చికిత్సలేని
MND
వంటి భయానక రోగములు సిద్ధమవుతాయి.
7.
మట్టి వాసన మనకు పడదు. పూలు పూయని ప్లాస్టిక్
మొక్కలు ఇంటి చుట్టు నయనానందమును కలిగిస్తే
నయనానందముతో బాటు సర్వతోభివృద్ధికి తోడ్పడే
వృక్షసంపద ఉద్యానవనములలో సహితము
కనుమరుగవుతుంది.
ఇలా వర్ణించడము ప్రారంభిస్తే దీనికి అంతమే
ఉండదు.
మరి మన దగ్గర ఈ సమస్యలకు సమాధానము?
మన వ్యవహారములో వసంతాది ఋతువులు, మన ప్రకృతిలో
ఆ ఋతువుల లక్షణములు ఒకేసారి కనిపించేలా
ఏర్పాటు చేసుకోవాలి. అపుడు ప్రకృతికి
అనుకూలముగా చెప్పబడిన పండుగలు
ఆయా సమయములోనే వస్తాయి. ఏకాదశి ఉపవాసములు,
పండుగల పిండివంటలు, సంక్రాంతులలో నదీస్నానము,
నదులు మరియు పశువులకు పూజలు కాలానుగుణంగా
ఆచరించాలి.
సూర్యుని సంక్రాంతి మరియు చందృని తిథులతో
ఉమ్మడిగా వచ్చే ఈ మాసములు మరియు ఋతువులు, వాని
విశేషతను బట్టి మనము అనుసరించే సంప్రదాయములు
మన సర్వతోబ్వృద్ధికి ఏర్పాటు చేయబడినవి.
ఇందులోని ఏ అంశమూ కల్పితము కాకపోవడము మరియు
విజ్ఞానయుతము కావడము ఆశ్చర్యంగా ఉంది కదా?
అందువలనే అధిమాసము..
అందువలనే ప్రకృతితో సమానముగా మన కాలమును
పరిరక్షించుకోవడానికి మధ్య మధ్యలో అధికముగా
వచ్చే మాసమును అధికమాసమని పేరు పెట్టారు.
దీనినే మలమాసము మరియు శూన్యమాసమని అని కూడా
అంటారు. మాస గణనలో దానికి స్థానము లేకపోవడము
మరియు ఫలితములో అది శూన్యము అవడమువలన దానికి ఆ
పేరు వచ్చినది.
దానిని గుర్తించడమెలా?
చాలా సులభము. ఒక అమావాస్యనుండి మరియొక
అమావాస్య వరకు గల సమయమును చాంద్రమాసము అంటాము.
ఈ కాలపరిధిలో సూర్యుడు రాశి మారతాడు. అలా రాశి
మారడాన్ని మనము సంక్రాంతి అంటాము. ఈ
కాలపరిధిలో సూర్యుడు కనుక రాశి మారకపోతే అది
అధిమాసమని లెక్క. అనగా ఏ చాంద్రమాసములో అయితే
సూర్యుని సంక్రాంతి ఉండదో దానికి అధిమాసమని
పేరు.
క్షయమాసము
క్షయమాసము కూడ ఇదే విధముగా ఏర్పడుతుంది. ఒకే
చాంద్రమాసములో రెండు సూర్యసంక్రాంతులు వస్తే
దానిని క్షయమాసము అంటాము. ఇది చాలా అరుదుగా
వస్తుంది. ఇది 141 సంవత్సరములకు వస్తుంది.
ఒకొక్కసారి ఇది వచ్చిల తరువాత 19 సంవత్సరములకే
వచ్చు అవకాశమున్నది. కానీ ఇలా రావడము చాలా
అరుదుగా ఉంటుంది.
ప్రస్తుత ఉగాది
-
బ్రహ్మగారి మొత్తము వయస్సు 100
సంవత్సరములు.
-
ప్రస్తుతము ఆయన వయస్సు సగము అయిపోయింది.
-
మిగిలిన సగములో ఇప్పుడు మొట్టమొదటి కల్పము
నడుస్తున్నది.
-
ఈ
కల్పములో ఆరుగురు మనువుల కాలము ముగిసినది.
ప్రస్తుతము ఏడవవాడయిన వైవస్వతమనువు సమయము
నడుస్తున్నది.
-
వైవస్వతమనువులో
27 మహాయుగములు గడచిపోయినవి. ప్రస్తుతము
28వ మహాయుగములో కృత,
త్రేతా ద్వాపర
యుగములు ముగిసినవి. కలియుగము
నడుస్తున్నది.
-
కలియుగములో మనము ఈ మార్చినెలలో చేసుకునే
ఉగాదినాటికి
5111 సౌరవర్షములు పూర్తవుతాయి. అనగ
5112వ సంవత్సరము ప్రారంభమవుతుంది. ప్రభవ
నుండి లెక్కపెట్టే మనకు ఇది వికృతనామ
సంవత్సరమయితే ఉత్తరభారతదేశమునందలి
బార్హస్పత్యమానమును అనుసరించే వారికి ఇది
శోభనకృత్ అను వర్షము.
సశేషము.....