కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
వీక్షణం సాహితీ సమావేశం -46
- పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్

వీక్షణం 46 వ సాహితీ సమావేశం ఫ్రీ మౌంట్ లోని శ్రీ పెద్దు సుభాష్, వందన గారింట్లో జూన్ 12 వ తారీఖున విజయవంతంగా జరిగింది. సుభాష్ గారు అందర్నీ ఆహ్వానిస్తూ రెండవసారి వారి ఇంట్లో ఈ సమావేశం జరగడం చాలా సంతోషకారణమని చెప్పారు. శ్రీ కూరపాటి భాస్కర్ గారు సభకి అధ్యక్షత వహించి, ముందుగా "కథా పఠనం" కార్యక్రమంలో శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారిని కథ వినిపించమని కోరారు.

రమాపతి రావు గారు శ్రోతల్ని కథకి పేరు సూచించమని కోరుతూ, కథా పఠనాన్ని కొనసాగించారు. అమెరికాలో ఉంటూ భారతదేశంలో ఉన్న తండ్రిని కోల్పోయిన వనిత కథ. ఆ ఉద్వేగంలో తనకి సహాయం చేసిన మిత్రుడే భాగస్వామి అయిన వైనం. ఆద్యంతం కథ అందరిని ఆసక్తిదాయకులను చేసింది.

ఆ తరువాత శ్రీమతి రాధిక గారు తన కథానిక "అలంకరణ" చదివి వినిపించారు. అమాయకంగా పెళ్ళికలలు కనే పిల్లని ఎలా సముదాయించాలో తెలియక సతమతమయ్యే తల్లి మనో ఘర్షణ చక్కగా చూపించిన కథ. ఇంతా చేసి పెళ్ళీడుకి వచ్చిన పిల్ల పెళ్లొద్దని అనడం, విముఖత చూపించడం తల్లికి తలకాయ నొప్పైంది. ఆ మార్పు ఎందుకో కూతురు తల్లికి జాబు ద్వారా వివరించడమే కథా సారాంశం.
ఆ తరువాత రాధిక ప్రతీ ఏడాది తన పేరుతో ఇచ్చే "రాధిక అవార్డు "ని ఈ సారి శ్రీమతి కొండేపూడి నిర్మల కి ఇస్తూ , ఇప్పటికి తొమ్మిదేళ్లుగా అవార్డు గ్రహీతల వివరాలను తెలిపారు.

తరువాత చిన్నారులు గ్రంథి శ్రీమయి, శ్రీ మైత్రి చక్కటి గాత్రంతో భాగవత పద్యాలు, మంచి పాటలు పాడి శ్రోతల్నిముగ్థులని చేసారు.

కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ప్రతీసారిలాగానే చాలా ఆసక్తికరంగా సాగింది. శ్రోతలందరూ ఉత్సాహంగా పాల్గొని రక్తి కట్టించారు. కిరణ్ ప్రభ గారు ఎంత పాప్యులరో మరోసారి ఋజువయ్యింది.
తెలుగు రచయిత వెబ్ సైటు గురించి కె.గీత, పెద్దు సుభాష్ గార్లు వివరిస్తూ తెలుగు రచయిత నిర్వహణ సహకారం అందిస్తున్న "గాటా" కు 501(సి) నమోదు వచ్చిందని, విరాళం ఇచ్చిన వారికి టాక్సు లాభం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా ఇచ్చే విరాళంతో వారి కంపెనీలు కూడా మేచ్ చేస్తాయని, సాహితీ మిత్రులు, సాహిత్యాభిమానులు ఇందుకు సహకారం ఇతోధికంగా అందించమని కోరారు. విరాళం ద్వారా తమకు నచ్చిన రచయిత పేజీని స్పాన్సర్ చేయవచ్చునని, వివరాలకు తెలుగురచయిత డాట్ ఆర్గ్ చూడవచ్చని తెలిపారు.

విరామంతర్వాత జరిగిన కవి సమ్మేళనంలో నూతక్కి రాఘవేంద్రరావు గారు తమ "నానో" లను చదివి వినిపించారు. కొండే పూడి నిర్మల కవిత రాయలేని స్థాయిని గురించిన కవితను, డా|| కె.గీత "తొలి పొద్దు పరిష్వంగం" ను, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అమెరికాలోని తెలుగు బడికెళ్తున్న మనవడి గురించి కవితను, శ్రీ రామానుజరావు పైసా మహిమల్ని గురించిన కవితలను వినిపించారు. ఆ తరువాత చక్కటి పద్య పఠనంతో శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, శ్రీ పాలడుగు శ్రీ చరణ్, శ్రీ పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్ వరుసగా సభను అలరించారు.

అక్కిరాజు వారు పెద్దు సుభాష్ గారి సూచన మేరకు పిల్లలకి పద్యం ఎలా పాడాలో నేర్పిస్తానని వాగ్దానం చేసారు.

యువ కవి దీక్షిత శేఖర్ ఆంగ్ల భాషలో తనదైన శైలిలో ఒక కవిత చదివి వినిపించారు. ఆ తరువాత శ్రీ రామానుజారావు, శ్రీమతి కె.గీత, శ్రీమతి విజయ గార్ల చక్కటి పాటల్తో సభ ముగిసింది.

ఇంకా ఈ సభలో శ్రీమతి విజయ ఆసూరి, వారి తల్లి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి భాస్కర్, శ్రీమతి భాస్కర్, శ్రీమతి ఉదయ లక్ష్మి, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి విజయ, శ్రీ తాటిపామల మృత్యుంజయుడు, శ్రీ కృష్ణబాబు, శ్రీ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)