కబుర్లు  

వీక్షణం సాహితీ గవాక్షం 17

- రచన :  నాగరాజు రామస్వామి  


 

ఈ నెల వీక్షణం సమావేశం జనవరి 12, ఆదివారం సాన్హోసే లోని రావు తల్లాప్రగడ గారి ఇంట్లో జరిగింది. సాహిత్యాభిలాషులు సౌహార్ద్ర వాతావరణంలో సమావేశం జరుపుకున్నారు.ఈ సమావేశానికి ముఖ్య ఆకర్షణ విశిష్ట అతిథి, ప్రముఖ స్రీవాద రచయిత్రి,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కాత్యాయినీ విద్మహే గారు.

శ్రీ రావు తల్లాప్రగడ గారు ''బడిలో ఏముందీ, దేవుని గుడిలో ఏముందీ'' అన్న సినీగీత చరణాలతో సభను ప్రారంభించారు. ''ఏ వేదంబు పాటించె లూత'' అంటూ ధూర్జటి పద్యాన్ని, ''భక్తి కారణమగుగాని చదువు కారణమగునే'' అనే మొల్ల రామాయణ అవతారికలోని ఉదాత్త పద్య పాదాలను గొంతెత్తి శ్రావ్యంగా ఆలపిస్తూ చక్కని సాహితీ వాతావరణానికి తెర తీసారు. విశిష్ట అతిథి శ్రీమతి కాత్యాయినీ విద్మహే గారిని క్లుప్తంగా పరిచయం చేస్తూ వారి జీవనానుభావాన్ని పంచవలసిందిగా కోరారు.

అందుకు విద్మహే గారు నిసర్గ మందహాసంతో ప్రశాంత వైదుష్య సంభాషణంగా తమ అనుభవ సారాన్ని సభకు అందించి అలరించారు. వేదిక మీది ఉపన్యాసాల లాగా కాకుండా సాహితీ సకుటుంబీకుల మధ్య సాగిన ముచ్చట్ల సమాహారంగా సభ ఆత్మీయంగా కొనసాగింది.

విద్మహే గారు క్లుప్తంగా తమ బాల్య జీవితం గురించి చెబుతూ తన తండ్రి కేతవరపు రామశాస్త్రి గారు స్వయంగా సాహిత్యవేత్త కావటం, తన చిన్ననాటి వాతావరణం సాహిత్యానుకూలంగా ఉండడం చక్కని నేపథ్యంగా అంది వచ్చిందన్నారు. వరంగల్ లోని తన విద్యాభ్యాసం రోజులలోనే స్త్రీవాద భావాలకు అంకురార్పణ జరిగిందని, వివక్షను ప్రశ్నించాలన్నపట్టుదల అప్పుడే మనసులో గట్టిగా నాటుకుందని చెప్పుకొచ్చారు. ఆనాటి ప్రాంతీయ సామాజిక జనజీవనాన్ని అనేక అసమానతలు, వివక్షలు , అణచివేతలు కుదిపివేసేవని, ప్రజలలో తిరుగుబాటు ధోరిణి, రాడికల్ వామపక్ష భావజాలం విస్తృతంగా ఉండేదని, అప్పుడే తానూ మార్క్సిజం వేపు మొగ్గుచుపానని తెలిపారు. అప్పుడే దళిత, రైతాంగ, కులతత్వ, గిరిజన, మైనారిటీ, తెలంగాణ ప్రాంతీయ అణచివేతలే కాక సమాజంలో పురుషాధిపత్యం బలంగా పాతుకొని పోయిన సత్యాన్ని గ్రహించడం జరిగిందని వాక్రుచ్చారు. అదే సమయంలో ఓల్గా, రంగనాయకమ్మ, కొండేపూడి నిర్మల వంటి రచయిత్రులు స్త్రీవాద దృక్పథం వేపుకు మొగ్గుచూపారని తెలిపారు. స్త్రీవాదం ఒక అస్థిత్వ స్వరూపంగా ఆవిర్భవించింది 1982 లోనని, ఆ ఏడే అంతర్జాతీయ మహిళా దశాబ్దిని పురస్కరించుకొని ప్రతి university లో women studies wing ప్రారంభించాలని దేశావ్యాప్త పిలుపు రావడంతో తాము కార్యాచరణకు పూనుకున్నామని, పాఠ్య syllabus లో స్త్రీవాద దృక్కోణంతో రచించబడిన రచనలను చేర్చే ప్రయత్నం జరిగిందని చెప్పుకొచ్చారు. University women cell workshop లలో group research నిర్వహించడం జరిగిందన్నారు.తానూ,సహోద్యోగులైన శోభ, జ్యోతీ రాణి తమ రచనలను స్త్రీవాద దృక్పథం లోనే రాయాలని గట్టిగా నిర్ణయించుకున్నామని తెలిపారు. రాసేది సాహిత్యమైనా, ఆర్ధిక శాస్త్ర విషయమైనా నియంత్రిత స్త్రీ అంతరంగాన్ని చీల్చుకొని పుట్టుకొచ్చే స్వేచ్ఛా భావాలను స్త్రీల దృష్టికోణం నుంచి నిర్భయంగా రాయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

శ్రీమతి విద్మహే గారి ప్రశాంత ప్రసంగం ఇంకా ఇలా సాగింది.


అనాదిగా మగవాళ్ళ ఆడవాళ్ళ ప్రపంచాలు వేరువేరుగా ఉంటూవచ్చాయి. స్త్రీకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కరువయింది. మొల్ల, గార్గి, మైత్రేయి లాంటి సాహిత్యాలకు కూడా ప్రాధాన్యత కొరవడింది. ప్రాచీన సాహిత్యం పురుషాహంకారానికి గురిఅయింది. స్త్రీ సాహిత్యం ప్రాశస్త్యం పొందలేక చరిత్ర కెక్కలేక పోయింది. అప్పట్లో స్తూలంగా సూచించబడిన 600 ప్రాచీన కవులలో కేవలం ఆరుగురు మాత్రం కవయిత్రులుండడం అందుకు నిదర్శనం. ప్రాచీన గ్రంధాలలో నిర్దేశిత గుణాత్మక విలువల ప్రస్తావనే ఉందిగాని స్త్రీ అంతర్గత హృదయం ఆవిష్కరించబడలేదు. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకంలో స్త్రీల వివాహేతర సంభందాల మీదే ఎక్కువ చర్చ జరిగింది. పురాణేతిహాస స్త్రీ పాత్రల గురించి స్త్రీ దృక్పథాదర్శనంగా పరిశోధన జరుగలేదు. భరతుని నాట్య శాస్త్రం, అలంకార శాస్త్రాలు స్త్రీలు ఎలా మెలగుకోవాలనే చెప్పాయిగాని వారి అంతరంగ ఆకాంక్షల కనుగుణమైన భావాల అభివ్యక్తికి న్యాయం చేకూర్చలేదు. స్త్రీల సమగ్ర సాహితీ చరిత్ర ఈనాటికీ లేదు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ వంటి 200 మంది ప్రాచీన అర్వాచీన కవయిత్రుల నామసూచి తప్ప తాళ్ళపాక సుభద్ర మంజీర ద్విపద లాంటి కావ్యాలకు కూడా రావలసినంత గుర్తింపు రాలేకపోయింది. పురుషాధిక్య prejudiced attitude !

ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో అక్కడ ధిక్కారం పైకి లేస్తుంది. ధిక్కారం వాదంగా, ఘర్షణగా, ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. మగవాళ్ళ రచనలన్నీ 'నేను జ్ఞానిని, వినండి' అన్నట్లుంటాయి. ఆడవాళ్ళ రచనలు వినమ్రతను ప్రదర్శిస్తాయి. తరిగొండ వెంకమాంబ, రంగాజమ్మ లాంటి వారు సైతం 'మాకు వ్యాకరణం ఛందస్సు రాదు' అనే చెప్పుకున్నారు. బుచ్చిబాబు భార్య శివరాజు సుబ్బులక్ష్మి తన రచనల కన్నా తన భర్త గారి రచనల పైనే ఎక్కువ ఆసక్తి చూపేవారు. తరతరాలుగా వస్తున్న ఈ వినయ సంపదను అలనాటి రచయిత్రులు అనివార్య strategic silence గా అలవరచుకొని ఉంటారు.

సాహిత్యం గొప్ప విషయం.అది ధ్వనిప్రధానమయినది.స్ఫురింప చేసేది.స్త్రీ మాటలలో సహజసిద్ధ ధ్వని ఉంటుందని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేవారు. సాహిత్యం 'మహాప్రస్థానం 'తో ఆగిపోకుండా మరోప్రస్తానం కేసి ముందడుగు వేయాలి.

నిజానికి ప్రత్యేక వాదాలకు ఆందోళన చెందవలసిన పనిలేదు. వాదం మనకు లోచూపూను ప్రసాదించి మన అనుభవ ప్రపంచాన్ని విస్తరింప చేస్తుంది. సమాజంలో స్థిరపడి పోయిన అనర్థాల, వైరుధ్యాల వాస్తవాన్ని కళ్ళముందు ఉంచుతుంది. మనుషులను మనుషులుగా చూడటం, ప్రేమించడం నేర్పుతుంది.

సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిపెట్టిన 'సాహిత్యాకాశంలో సగం' గురించి మాట్లాడుతూ ఆ పుస్తకంలో ముఖ్యంగా కవిత్వం,కథల విశ్లేషణ ,methodology ,బండారు అచ్చమాంబ, వట్టికొండ విశాలాక్షి, రంగవల్లి లాంటి వాళ్ళపై వ్యాసాలూ ఉన్నాయని వివరించారు విద్మహే గారు.

ఇలా విద్మహే గారి ప్రసంగం ధారాళంగా, ప్రశాంతంగా, మందహాస భరితంగా సాగింది.
ప్రసంగం మధ్యలో మనుస్మృతి చర్చ, ఛందస్సు పై ఉప చర్చ, సభికుల ప్రశ్నల పరంపర-ఇలా ఉల్లాసంగా,ఆత్మీయంగా సాగింది వారి ప్రసంగం.

తర్వాత వేమూరి వెంకటేశ్వర్లు గారు university of California,Berkely తెలుగు విద్యాపీఠం గురించి ప్రస్తావిస్తూ ఆ తెలుగు విద్యాలయం కొనసాగాలంటే మరి కొంత విరాళసేకరణ అనివార్యమని ,అందరి సహకారం ఉంటే అమెరికాలో తొలి తెలుగు విశ్వవిద్యాలయం చిరంజీవి అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఆ తరువాత కవిసమ్మేళనం. మొదట శ్రీమతి కె. గీత గారు 'అబ్బాయి ఇరవయ్యవ పుట్టిన రోజు 'వచన కవిత వినిపించారు. యుక్త వయస్సులో ప్రవేశించిన తన కొడుకులో తొలినాటి శైశవ బాల్య సౌకుమార్య మార్ధవాలను మాతృత్వ వాత్సల్యంగా కవితావేశంగా పునర్దర్శించుకున్నారు. పిదప నాగరాజు రామస్వామి 'కొత్తభయాలు'అనే వచన కవిత , రవీంద్ర గీతి అనువాద పద్యం వినిపించడం జరిగింది. ఆతరువాత శంషాద్ ఆంధ్రజ్యోతి లో ప్రచురించబడిన 'మందివ్వమ్మా'అనే వచన కవితను వినిపించి శ్రోతలను అలరించారు.

సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం ఆద్యంతం ఆనందదాయకంగా నడచింది.

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)