శీర్షికలు - తెలుగు తేజోమూర్తులు

స్వాతంత్ర్య సమరయోధుడు జాతీయ గేయ కవి

శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ

ఈ శతాబ్ధపు జాతీయ గేయ సాహిత్యంలో మేటి తార శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. భారత దేశ స్వాంతంత్రం కోసం పోరాడారు. బ్రిటీష్ సామ్యవాదానికి వ్యతిరేకంగా అనేక కవితలు వ్రాసి ప్రజా చైతన్యం కలిగించారు. వీరు రచించిన - " మా కొద్దీ తెల్ల దొరతనం " జన హృదయాలను ఆకట్టుకుని ఆంధ్ర నాట ప్రతీ నోటా ఈ గేయం వినిపించింది. వీరికి మిక్కిలి కీర్తి తెచ్చిపెట్టింది!. అనేక మార్లు ఈ గేయాలను పాడిన వైనాలున్నాయి. ఈ గేయం వ్రాసినందుకు, 1922 లో ఒక ఏడాది కారావాసం అనుభవించారు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఓ గొప్ప జాతీయ గేయ కవిసార్వభౌముడు, పాత్రికేయుడు. తన కవితా పటిమతో జన చైతన్యం కలిగించిన నిరుపమాన దేశ భక్తుడునూ. ఆయన గేయాలు బ్రిటీషర్లను బెంబేలెత్తించాయి. ఈ నిరుపమాన దేశ భక్తుడి గేయాల ద్వారా జన హృద్యయాలలో దేశ భక్తి చైతన్యం చేస్తున్నందుకు చెరశాలలో నిర్భందించినా, వీరి గేయాలాపనలు ఏమాత్రం తగ్గించలేక పోయారు. అది ఇంకా రాజుకుందే కాని ఏమాత్రం తగ్గ లేదు.

జననం, బాల్యం:

గారిమెళ్ళ సత్యనారాయణ గారు 14 జులై, 1893 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లా లోని పేరి అగ్రహారం వద్ద గోనెపాడు లో ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తల్లి తండ్రులు - గరిమెళ్ళ వెంకట నరసింహం, సూరమ్మ.

నాటి న్యాయవాది కన్నేపల్లు నరసింహారావు ఆర్ధిక సహాయం అందుకుని బందరు, విజయనగరం, రాజమండ్రి నగరాలలో చదువుకుని బి ఏ పట్టా అందుకున్నారు గరిమెళ్ళ.

గంజాం జిల్లా కలెక్టర్ గారి వద్ద గుమాస్తాగా పనిచేశారు. తరువాత విజయనగరం జిల్లా ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.

మహాత్మా గాంధీ గారి పిలిపు మేరకు - ప్రజా నిరాకరణోధ్యమం లో పాల్గొన్నారు. గరిమెళ్ళ వ్రాసిన "మా కొద్దీ తెల్ల దొరతనం " గేయం తెలుగు నాట ప్రతీ నోటా పలికేది. ఈ పాట వ్రాసినందుకు గాను వీరికి 1922 ఓ ఏడాది పాటు కారవాసం లబించింది. బయటికి విలువడిన తరువాత గ్రామ గ్రామం తిరిగి అనేక గేయాలాపన చేసారు. ఈ కారణంగా గరిమెళ్ళ సత్యనారాయణ ికి రెండున్నర ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించారు. అయినా, ఆయన దేశ భక్తి ఉనికిని రవ్వంత కూడా కరిగించలేకపోయింది.

గరిమెళ్ళ చెరశాలలో ఉన్నప్పుడు - వారికి ఐన వారు - భార్య, తండ్రి, తాత అందరూ కనుమూసారు.

గరిమెళ్ళ రచనలు:

- స్వరాజ్య గీతాలు

- హరిజన పాటలు

- ఖండ కావ్యాలు, బాల గీతాలు

- భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి - ఎకనామిక్ కాంక్ వెస్ట్ ఆఫ్ ఇండియా తెనుగనువాదం

- తిరుకురాళ్, నాందియార్ తమిళ రచనల తెనుగీకరణ

గరిమెళ్ళ సత్యనారాయణ సాహితీ సంకలనాలు - నాటి మేటి పత్రికలు కృష్ణ పత్రిక, ఆనందవాణి, ఢంకా, ఆంధ్ర ప్రభ, భారతి పత్రికలలో ప్రచురించబడ్డాయి.

మా కొద్దీ తెల్ల దొరతనం - గేయం:

మా కొద్దీ తెల్ల దొరతనం దేవా

మా కొద్దీ తెల్ల దొరతనము

మా ప్రాణాల పై పొంచి - మానాలు హరించె

పన్నెండు దేశాలు - పండుతున్నా గాని

పట్టెడన్నమే లోపమండి - ఉప్పు

ముట్టుకుంటే దోషమండి - నోట

మట్టి గొట్టి పోతాడందీ - అయ్యో

కుక్కలతో పోరాడి కూడు తింటామండి

వర్తకంబునకు వచ్చి పట్టనంబుల పట్టి

రాజ్యమొక్కటి అల్లినాడు దాన్ని

రాణి కప్ప గించినాడు - రాణి

పత్రమ్ము చించేసినాడు - ఈ

చిత్రమిదేమన్న శిఖిస్తామన్నాడు

కోర్టులంటూ పెట్టి - పార్టీలు పుట్టించి

స్నేహభావము చంపినాడు - ద్రవ్య

దాహము కల్పించినాడు - చెడ్డ

యూహలు కడు పెంచినాడు - మా

ఆహారములు ద్రుంచి ఆహా! యనిపించాడు

................

" నూరుగురు తెలుగు ప్రముఖులు " పుస్తకంలో నరసింహారావు గరిమెళ్ళ సత్యనారాయణ గురించి వ్రాసారు.

ప్రముఖ సంగీతకారులు పాలగుమ్మి విశ్వనాధం - "జాతీయ గేయ మాల " సంకలనంలో శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గేయాలను పొందుపరిచి నేటి తరానికి అందించారు. తపన, భాషాభిమానం అంటే ఇది. చూసి నేర్చుకోవాల్సిందే!.

ఈ ప్రజా పాటల గరిమెళ్ళ - డిసెంబర్ 18, 1952 లో తన అరవై ఓ ఏట స్వర్గస్తులైయారు. చివరి దశలో కడు పేదరికం అనుభవించారు. ఆర్ధిక దారిద్ర్యం ఉద్భవించినా, భావ దారిద్యం లేని గొప్ప వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ . వీరి రచన "మా కొద్దీ తెల్ల దొరతనం" భారతీయ జన హృదయాలలో చిరకాలం నిలచియుంటుంది. గారిమెళ్ళ సత్యనారాయణ అమూల్య సేవల జ్ఞాపకార్ధం వీరి శిలా విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్టించారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)