కబుర్లు

వీక్షణం - సాహితీ గవాక్షం

- నాగరాజు రామస్వామి

27 వ సమావేశం
( మాసం మాసం శ్రుత సాహిత్యం )

నవంబర్ 16, ఆదివారం రోజున, ఈ నెల వీక్షణం సాహితీ సమావేశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో వారి కుమారుడు శ్రీ వంశీ గారి ఇంట్లో (ఫ్రీమాంట్) జరిగింది. పాతిక మంది తెలుగు మిత్రులు కలసి చేసుకున్న సాహిత్య విందు! శ్రీ గంగిశెట్టి వారి లాంచన ఆహ్వానానంతరం శ్రీ అక్కిరాజు రమాపతి గారి అధ్యక్షతన సభ ప్రారంభమయింది.



మొదట శ్రీ వేణు ఆసూరి గారు వాల్మీకి రామాయణం పై కీలక ప్రసంగం చేశారు. రామాయణం సమగ్ర ఆదికావ్యమనీ, తనకెంతో ఇష్టమైన విశిష్ట గ్రంథమనీ, ఇతివృత్తం గానే గాక కథాకథన రీతిలో, ప్రక్రియా పరమైన కావ్య రచనా విధానంలో కూడా రామాయణం విశేష కావ్యమని అన్నారు. ఉదాహరణకు నాటకీకరణ (Dramatisation). వాల్మీకి రామాయణంలో సంఘటనలు సమాంతరం గా ప్రవహిస్తాయి. ఒకే సందర్భానికి చెందిన వివిధ సంఘటనలు ఒకదాని ప్రక్క మరొకటి ఏక కాలంలో ప్రదర్శితమవుతున్నందున నాటకీయతకు బలం చేకూరింది . పట్టాభిషేక ఘట్టంలో ఒకవైపు నగరంలో పుర వీధుల అలంకరణ సాగుతుంటుంది. అంతఃపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుంటవి. అంతలోనే కైక ప్రవేశిస్తుంది. ఇంకో దిక్కు నుండి మంథర ప్రవేశిస్తుంది. మరో వైపు రాముడు ఆయత్తమౌతుంటాడు. వరం తీర్చకుంటే విషం తాగి చస్తానంటుంది కైక. దశరథుడు గుండె కోతకు గురి అవుతుంటాడు. ఇలాంటి గొలుసు కట్టు సంఘటనల సమాహారాన్ని ఒక విశిష్ట రీతిలో విరచిస్తాడు వాల్మీకి. ఒక సన్నివేశ శకలానికి సమగ్ర స్వరూపమిస్తూ, వెనక్కి వచ్చి మరో సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ నాటకాన్ని నడిపిస్తుంటాడు. ఇది నేటి సినిమాటిక్ స్టైల్ కు భిన్నమైనది. సంఘటనల సంవిధానంతో సన్నివేశాన్ని బలోపేతంచేసి కావ్యంలో నాటకీయతను ప్రతిష్టించి రక్తి కట్టిస్తాడు.

సీతాదేవి వనవాసానికి వెళ్ళే ముందు అంతఃపుర స్వజనం ఎదుట నార చీరలు ధరించే సన్నివేశం, భరతుణ్ణి పిలిచేందుకు ఆఘమేఘాల మీద అశ్వికులు పరుగెత్తడం, అటు సీతారాములు వనవాసానికి బయలుదేరి పోతుండడం, ఇటు దశరథుడు ప్రాణాలను వదలడం వంటి పలు సమాంతర సంఘటనలు రసపోషణ నాటకీయ రచనాశైలికి నిదర్శనాలు. షేక్స్పియర్ లాగే వాల్మీకి కూడా సంభాషణల ద్వారా పాత్రల స్వభావాన్ని వ్యక్త పరుస్తాడు. రాముడు సౌమ్యుడు.

రావణుడు అందుకు భిన్నుడు. వాల్మీకి అనుసరించిన విశిష్ట కథన రీతిలో, పాత్ర చిత్రణలో ఈ పాత్రోచిత భిన్న స్వభావాలు మరింత ప్రస్ఫుట మౌతాయి. చక్కని character build-up! ఇందులో flash back లు అనేకం. వీటితో గత వంశ చరిత్ర అభివ్యక్త మౌతుంది.ఆనాటి వందిమాగధుల పాత్ర నిజానికి అదే. శ్రీ రామున్ని విశ్వామిత్రుడు అడవికి తీసుకెళ్తున్నప్పుడు చెప్పిన కథనాలు, భగీరథ, శ్రవణ కుమారుల కథలన్నీ ఫ్లాష్ బాక్ లే.

వాల్మీకి రామాయణంలో అద్భుతమైన ఉపమానాలు కోకొల్లలు.అబ్బుర పరిచే వర్ణనలు అనేకం. లంకాపురి, అయోధ్య వంటి నగరాల వర్ణనలు అమోఘం. ఉపనయన శ్లోకాలలో ఉటంకించబడిన ఉదాత్తమైన పదహారు కళలు రాముని పట్ల అన్వయింపబడ్డాయి. అందుకేనేమో రాముడు షోడశ కళల రామచంద్రుడయ్యాడు! గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞస్య, కృతజ్ఞస్యాది పదహారు లక్షణాలు వాల్మీకి రామాయణంలో అడుగడుగునా document చేయబడినాయి.

ఇందులో ధర్మాధర్మ విచక్షణ, రాజధర్మ పాలనారీతి పాత్రల ద్వారా చెప్పబడింది. పలు వ్యాఖ్యానాలు కల సుందర కాండలో హనుమంతుడు ధృతి, దృష్టి, మతి, దాక్షం(పటుత్వం) వంటి సల్లక్షణ శోభితుడుగా వర్ణింపబడ్డాడు. ఇందులో విహిత కర్మల, నిషిద్ధ కర్మల ప్రస్తావన ఉంది. శ్రీభాష్యం అప్పలాచార్యులు, చాగంటి కోటేశ్వరరావు వంటివారు సీతారాములను ఆత్మ పరమాత్మ అద్వైత రూపాలుగా దర్శించుకున్నారు.

వాల్మీకి రామాయణం ఒక అపూర్వమైన కావ్యనిర్మాణం!
ఇలా శ్రీ వేణు అసూరి గారు అద్భుతమైన ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

అధ్యక్షులు శ్రీ అక్కిరాజు రామాపతి గారు తన స్వీయ రచన ఐన 'శ్రీ రామాయణ సంగ్రహం' గ్రంధాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడారు. 24000 శ్లోకాలతో 7 కాండలలో విస్తరించిన వాల్మీకి రామాయణం ఎందుకు ఆత్మీయమవుతూ వస్తున్నదో వివరించారు. మనకు 1008 రామాయణాలు ఉన్నవి. ఆసేతు హిమాలయ పర్యంతం సగం రామాయణ కథలే ఉన్నవి. లలిత కవిత్వం, మానవ సంబంధాలు, వర్ణనలు, చిత్రవిచిత్ర మైన కథలు రామకథలో ఆకర్షణీయంగా చెప్పబడ్డాయి. ఇంకా విప్పవలసిన ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నప్పటికీ రామాయణం మనం అధ్యయనం చేయవలసిన ఆరాధ్య గ్రంథం అని చెప్పుకొచ్చారు అధ్యక్షులు.

శ్రీ శ్రీచరణ్ గారి స్పందన నిజానికి పై వక్తల రామాయణ విశేషాల పొడిగింపు; ఒకటి రెండు అభ్యంతరాలు మినహా. "భూమి సుతా మనోంబురుహ పుష్కల రాగ ......శోభన రామున కంజలించెదన్" అంటూ "చిల్లర"వారి పద్యంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. యుగవిభజనను క్లుప్తంగా వివరించారు. మొల్ల రామాయణంలో రామరాజ్య వర్ణనలో కవిత్వం గుప్పించబడిందన్నారు. రెండక్షరాల "రామ" శబ్దం పదికోట్ల శ్లోకాలకు సమానమని వాక్రుచ్చారు. రాక్షసుడైన మారీచుని చేత కూడా "రామో విగ్రహామాన్ ధర్మమ్"అని ప్రశంసించబడిన రాముణ్ణి తలచుకున్నారు. అధ్యక్షుల వారు సందేహించిన వాలి సంహార ఘట్టాన్ని రామ పక్షపాతిగా సమర్ధించారు. gladiator తరహాలో వాలి క్రూర వినోదాలు జరిపించేవాడనీ, అలాంటి జంతు సమానమమైన వాలిని అలా చంపడం సబబేనని శ్రీచరణ్ గారు చెప్పుకొచ్చారు. మాయలేడి రూపము లో ఉన్న మారీచుడు "హా లక్ష్మణా" అని అరవటానికి కారణం రావణునికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాని రాక్షస నైజం కాదని తెలిపారు. శ్రీ చరణ్ గారి ప్రసంగం సాధికారంగా సహేతుకంగా సాగింది.

వేమూరి వేంకటేశ్వర రావు, ఇక్బాల్, చుక్కా శ్రీనివాస్ మొదలైన వారి స్పందన ప్రతిస్పందనల తో చర్చ ఆసక్తికరం గా సాగింది.

తర్వాత, అతిథేయులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణగారు శ్రీ కిరణ్ ప్రభ గారిని (దంపతులను) వేల పురాతన అలభ్య గ్రంధాలను ఈ- పుస్తక రూపం లో ఉంచిన సాహిత్య సేవకు గుర్తుగా శాలువ కప్పి సత్కరించారు. ప్రౌఢ కవిగా పరిచయం చేస్తూ నాగరాజు రామస్వామినీ, కవితా రజతోత్సవ సందర్భంగా కవయిత్రి డా||కె.గీత గార్లను కూడా శాలువలు కప్పి సన్మానించారు. అది వారి ఔదార్యానికి సహృదయతకు సాహిత్యతత్పరకు ఆనవాలు!

తరువాతి కార్యక్రమం కవిసమ్మేళనం. ఈ సారి ఎక్కువ మంది కవితలు చదివారు.మొదట నాగరాజు రామస్వామి తన మనుమడు చిరంజీవి అర్ణవ్ రాసిన ఆంగ్ల పద్యానికి ఆత్మీయానువాదం "హరితం" కవిత వినిపించాడు. శంషాద్ బేగం "తుఫాన్", "మందివ్వమ్మా" కవితలు చదివారు. డా||కె.గీత గారు 'నదులను పొరలు చేసి ......' అంటూ "ఖండాంతరాలలో అపరాహ్ణం" కవిత వినిపించారు. వంశీ ప్రఖ్య గారి "స్మార్ట్ మనిషి"అనే కవితలో 'వేలు ఆడక పొతే వేలాడిపోయే అధునాతన బతుకులను' వ్యంగీకరించారు.'అప్రాశ్చ్య దేశం' లోని 'ఆప్ దేవతలను' వినోదాత్మకంగా కవిత్వీకరించారు. రావు తల్లాప్రగడ గారి 'మావూరి వారు' కవితలో నాస్టాల్జియా అందంగా రూపొందింది. వేణు ఆసూరి గారు వినిపించిన రెండు చక్కని కవితలు 'కొవ్వొత్తులు', 'కొత్తబట్టలు' . శ్రీచరణ్ గారి 'కార్తీక మాసం' కవిత శివ విష్ణువులు ఏకమైన ఆధ్యాత్మిక లోతులున్న అద్వైత కవిత్వం. శ్రీమతి విజయలక్ష్మి కొత్త కోడలిని ఆహ్వానించినప్పటి కవితను వినిపించారు.

విద్యావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విశ్రామ ఉపకులపతి శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారిని పద్య వైభవం గురించి మాట్లాడమని కోరగా వారు ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకైన 'పారిజాతపహరణం' లోని ఒకటి రెండు పద్యాలను అత్యంత రమ్య మనోహరంగా వివరించి వినిపించారు. ధ్వని శిల్పం, అర్థ శిల్పం పారిజాతాపహరణ కావ్యంలో పుష్కలంగా వుందన్నారు. 'ఎంతకు లేడు నారద మునీంద్రుడు!' పద్యాన్ని ప్రస్తావించారు. "అతుల మహాను భావమని అవ్విరి తా నొక పెద్దసేసి అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడిద ఇచ్చిన ఇచ్చె గాక , ఆ మతకరి మమ్ము తలంపగ నేల అచ్చటన్". ఈ పద్యం లో సత్యభామ స్వభావం ద్యోతక మౌతుందని, 'మతకరి', 'సూడిద' వంటి పదాల వెనుక వెటకార ధ్వని అందంగా పొదుగ బడిందని వారన్నారు. ధ్వనిశిల్పం అద్వితీయంగా పొందు పరచుకున్న పద్యం -"జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుదు కన్నతండ్రి శిర మచ్చోమ వామ పాదమున తొలగం జేసె లతాంగి . అట్లగు,నాథుల్ నేరముల్ సేయ పేరలుకన్ చెందిన కాంతలుచిత వ్యాపారముల్ చేయ నేర్తురే!" . లలితమైన పదాలతో వర్ణించబడిన ఈ పద్యంలో కృష్ణుని కోమలత్వం అత్యంత సుందరంగా అభివ్యక్తీకరించబడిందని తెలిపారు.ఇలా గంగిశెట్టి గారి పద్య పఠనం తో శ్రోతలు మం త్ర ముగ్ధులయ్యారు.

తరువాత, కిరణ్ ప్రభ గారు నిర్వహించిన సాహిత్య క్విజ్ ఆసక్తి దాయకం గా కొనసాగి అందరినీ ఆనంద పరిచింది.
గూప్ ఫోటో తర్వాత అతిథేయులు ఇచ్చిన పసందైన early dinner! సాహిత్య విందు తో పాటు ఆత్మీయమైన విందు భోజనం!

ఈ నాటి వీక్షణం సమావేశం సుమారు నాలుగు గంటలపాటు ఆద్యంతం ఆసక్తి కరంగా ఆనందదాయకంగా సాగింది.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)