పూర్వం భోజమహారాజు ధారా నగరాన్ని పరిపాలించే రోజులలో ఒక హంతకునికి ఉరిశిక్ష పడింది.ఆ హంతకునికి కవిత్వం అల్లడం వచ్చు.
ఉరికంబం దగ్గరికి తీసుకొని వెళ్ళి, నీ చివరి కోరిక ఏమిటని అడిగారు.
అప్పుడు వాడు'ఒక్కసారి భోజమహారాజును దర్శించుకోవాలని ఉంది' అన్నాడు. అప్పుడు అధికారులు మహారాజుకు ఈ విషయాన్ని తెలియజేశారు. మహారాజు ఆ హంతకుని చివరి కోర్కె తీర్చడానికి వచ్చాడు.మహారాజును చూడగానే ఆ హంతకునికి కవిత్వం పొంగుకొని వచ్చింది. వెంటనే ఇలా శ్లోకం ఆశువుగా చెప్పాడు-
'భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టో
భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టః
భుక్కుండోహం భూపతిస్త్వం హి రాజన్ !
బభావళ్యామంతకస్సన్నివిష్టః'
ఈ శ్లోకంలోని చమత్కారం ఏమిటంటే---'ఓ రాజా! ఇప్పుడు యముడు అక్షరక్రమంలో 'భ'అనే అక్షరం దగ్గర ఉన్నాడు.
అందుకే మొన్న భట్టీ, భారవీ, నిన్న భిక్షువూ, భీమసేనుడూ, చనిపోయారు. ఇప్పుడు 'భుక్కుండ'అనే పేరుగల నన్ను చంపడానికి వచ్చాడు.
నా తరువాత 'భూపతి' వి నీవే కనుక నిన్నూ చంపుతాడు. కనుక మీరే ఆలోచించి నాకు శిక్షను అమలుచేయండి'అన్నాడు.
అప్పుడు వాడి కవితాశక్తికి అబ్బురపడిన భోజరాజు వాడి ఉరిశిక్షను తప్పించి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడట.
ఈ కథ ఎంతో చమత్కారంగా ఉంది కదా!