|
రచన :
నాగరాజు రామస్వామి
వీక్షణం 23 వ సాహితీ సమావేశం
ఫ్రీ మౌంట్ లోని "సెకండ్ వర్క్ స్పేస్" ఆఫీసు
ప్రాంగణం లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు గ్రహీత డా|| కాత్యయనీ విద్మహే
విచ్చేసారు.
శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షతన జరిగిన
ఈ సభలో ముందుగా కాత్యాయనీ విద్మహే "శత
సంవత్సరాల కాళోజీ కవిత్వం" అనే అంశం మీద
ప్రసంగించారు. ఈ సందర్భంగా కాళోజీ తో తనకున్న
వ్యక్తిగత అనుబంధాన్ని కూడా గుర్తు
చేసుకున్నారు.
చిన్నతనం లో వరంగల్ లో తమ తొలి అడుగు కాళోజీ
ఇంటిలోనే ప్రారంభమైందనీ, కాళోజీ ఎదురింటిలో
ఉంటూ తనకు లభించిన కవిత్వాసక్తి గురించి
అందరితో పంచుకున్నారు. అంతేగాక కాళోజీ
కుమారుడితో కలిసి విద్యాభ్యాసం చేయడం,
పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొనదం వంటివి గుర్తు
చేసుకున్నారు. కాళోజీ కవిత్వ లక్షణాల్ని ఆయన
మాటల్లోనే పేర్కొంటూ "అసమ్మతి, ధిక్కారం,
నిరసన" ప్రధానమైనవని అన్నారు. ఈ
సందర్భంగా ఇతర రచయితలు, కవుల గురించి
పేర్కొంటూ అసలు మొత్తం తెలంగాణా లోనే సామాజిక
చైతన్యం, ఉద్యమ సంబంధం లేకుండా రచనలు చేసిన
వారు లేరని పేర్కొన్నారు.
కాళోజీ జనాన్ని గురించే ఎప్పుడూ
మాట్లాడేవారనీ, ఆయన "పలుకు బడుల భాష- బడి
పలుకుల భాష" అనే పదాలు వాడేవారనీ పలుకు బడుల
భాష అంటే యాసతో కూడుకున్న అసలు సిసలు భాష అనీ,
బడి పలుకుల భాష అంటే పాఠ్యపుస్తకాల్లో
అనుసరించిన గ్రాంధిక భాష అనీ,
"విశ్వవిద్యాలయాలు పలుకు బడుల భాషకి గౌరవం
తీసుకు వచ్చే స్థానానికి చేరాలని" అనే వారనీ
అన్నారు.
కాళోజీ జీవన వైవిధ్యాల్ని అర్థం చేసుకున్న
వారు కాబట్టే వైరుధ్యాల్ని అర్థం
చేసుకోగలిగారని అన్నారు.
1914 లో జన్మించిన కాళోజీ 1930 ల లో
తెలంగాణాలో వందేమాతర ఉద్యమం లోనూ, ఆర్య సమాజ
ఉద్యమం లోనూ ఫాలుపంచుకున్నారనీ అన్నారు. 1940
ల నాటికి ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరిస్తూ,
నైజాం వ్యతిరేక కవిత్వాన్ని రాసారు. "నాయకుడు
కావాల్సిన వాడు అదృష్ట వశాత్తు కవి అయ్యాడనే"
అని కాళోజీ గురించి దేవుల పల్లి రామానుజరావు
గారి వ్యాఖ్యను గుర్తు చేసారు.
ఆయన కవిత్వం లో పౌరుడు అనే మాటని అధికంగా
వాడేవారనీ, పౌరుడు కాని వాడిని పోరడు అన్నారని
అన్నారు.
"ప్రజాస్వామ్యమే జీవితానికి రక్ష" అన్న
ప్రజాస్వామ్యం పట్ల కాళోజీ గాఢ నమ్మకాన్ని
గుర్తుచేసారు.
"ప్రజాకవి కాళోజీ " గా ఆయన ప్రజల నాలుకల మీద
చిరకాలం నిలిచిపోయారని అన్నారు.
కాళోజీ కవిత్వ సమగ్రం "నా గొడవ" నించి కొన్ని
కవితా ఖండికల్ని చదివి వినిపించారు.
"కన్నీటిలో ఎన్నెన్నో గలవు, కన్నీటిని గన
కన్నులు కలవు", "చెమ్మగిలని కనులు బతుకు
కమ్మదనము చాటలేవు, చెమ్మగిలని కనులు బతుకు
కమ్మదనము చూడలేవు", "పుటక నీది, చావు నీది,
బతుకంతా దేశానిది" అన్న పాదాలు కరతాళ ధ్వనులలో
ముంచెత్తాయి.
కాళోజీ పేర్కొన్న ప్రభుత్వపు "అధికృత హింస"ని,
ప్రజల పక్షపు "ప్రతి హింసని" గురించి
వివరిస్తూ ఆయన కాళోజీ గొప్ప కథకుడన్న విషయం
చాలా తక్కువమందికి మాత్రమే తెలుసనీ అన్నారు.
ఆయన కథల్ని సూక్ష్మంగా వివరించారు. ఈ కథల్లో
భూతదయ, ఉద్యమ స్వభావం, రాజకీయాల పట్ల
వ్యతిరేకత ద్యోతకమవుతున్నాయన్నారు. గొప్ప
మానవతా మూర్తి కాబట్టే ప్రభుత్వం "పద్మ
విభూషణ్" తో సత్కరించిందని పొగిడారు.
ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో మహమ్మద్
ఇక్బాల్, విజయ కర్రా, చల్లా శ్రీనివాస్ మొ.న
వారు పాల్గొన్నారు.
ఆ తర్వాత "రాధిక సాహితీ అవార్డు" ప్రదానం
రచయిత్రి రాధిక 2014 సం.రానికి గాను "కె.గీత"
కు ప్రదానం చేసారు. రావు తల్లాప్రగడ గీత
కవిత్వ నేపధ్యాన్ని, జీవన విశేషాల్ని చెబ్తూ
"ఇన్స్పిరేషనల్ వ్యక్తిత్వం" అని కొనియాడారు.
కె.గీత మాట్లాడుతూ వీక్షణం లో ఇటువంటి సన్మానం
తనకు ఒక రోజు ఇలా జరుగుతుందని ఎన్నడూ కలలోనైనా
అనుకోలేదని అన్నారు.
తేనీటి విరామం తర్వాట ప్రముఖ కవి శ్రీ రావి
రంగారావు "మినీ కవిత" ను గురించి
ఉపన్యసించారు. 1116 కవితలతో తెచ్చిన కవిత్వ
సంకలనాన్ని గురించి వివరించారు. మినీకవిత
ప్రత్యేక శిల్పానికి ప్రతిరూపమనీ, ఆగమన, నిగమన
పద్ధతులు మినీ కవితల లక్షణాలనీ పేర్కొన్నారు.
మినీకవిత ఒక ఉద్యమంగా, ప్రక్రియగా మారడం వెనుక
ఉన్న ఆసక్తికర పరిణామాన్ని వివరించారు.
చిన్న వాక్యాలలో, ఆలోచనాత్మకంగా మలచడమే
మినీకవిత అని తెలుపుతూ "మా హాస్పిటల్
ప్రత్యేకత- స్మశానం అటాచ్డ్", "కవి నూరుతున్న
గోరింటాకు-పెట్టుకోండి మనసుకు- పండుతుంది
బతుకు" మొ.లైన కవితల్ని వినిపించారు. మినీ
కవితలో చెప్పాలనుకున్న భావం మనసులో పడి,
మొలిచేదాకా ఉండాలన్నారు.
తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో ముందుగా
ఉపాధ్యాయుల కృష్ణమూర్తి తమ కవిత్వ చమ్మకులను
వినిపిస్తూ" కవితవం సరళంగా ఉండాలి- గరళంగా
పనిచేయాలి" అన్నారు. "తెలుగు" భాష
గొప్పదనాన్ని గురించి అంత్య ప్రాసలతో పసందైన
కవిత్వాన్ని వినిపించారు. రావు తల్లాప్రగడ
చక్కని ఆలాపనామృతాన్ని పంచుతూ "ఆ దేవుడు కూడా
రాయైనా ఆ రాతికే పూజలు చేస్తాను, నీ గుండె
కూడా రాయేలే మరి అందుకే పూవులు
ఇస్తాను"అ ని గజల్ ని వినిపించారు.
ఇక్బాల్ "వైవిధ్యం" అనే ఆధ్యాత్మిక కవితని
వినిపిస్తూ "పుచ్చుకుని సంతోషిస్తుంది శరీరం,
ఇచ్చుకుని సంతోషిస్తుంది ఆత్మ" అన్నారు.
కె.గీత "ఎల్లోస్టోన్" కవితని తన సహజ చిత్ర
కవిత్వా ప్రతిభ ద్యోతకమయ్యే పదాలతో
వినిపించారు.
అంతా ఎప్పుడూ ఎంతగానో ఎదురుచూసే అద్భుత కిరణ్
ప్రభా మంత్రం "సాహితీ క్విజ్" అందరినీ
నవ్వులతో ముంచెత్తుతూ సరదాగా గడిచింది.
కవిత్వాన్ని గురించి అడిగిన ప్రశ్నలు అందరినీ
ఆలోచింపజేసాయి.
చివరాగా శ్రీ అక్కిరాజు రమాపతిరావు కాళోజీ తో
తన అనుబంధాన్ని అందరికీ తెలియజేసారు. కాళోజీ
"అత్యంత ఆర్ద్రమైన మనిషి, త్రిదస్యుడి వంటి
వాడు" అని కొనియాడారు.
ఈ సభకు ఆంధ్ర లక్ష్మి, లత , నరేంద్ర, గాయత్రి,
లెనిన్,కాంతి కరణ్, కరుణ కుమారి,
వేంకటేశ్వర్లు, ప్రభావతి మొ.లైన వారు కూడా
హాజరయ్యారు.
చివరగా కె.గీత "సెకండ్ వర్క్
స్పేస్" అధినేత "రమేష్ కొండా" గారికి
ధన్యవాదాలు సమర్పించి సభను ముగించారు.
|
|