కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
43 వ సమావేశం
- షంషాద్

మార్చి నెల వీక్షణం సమావేశం 13 వ తారీఖున ఫ్రీ మౌంట్ లో వేణు ఆసూరి గారింట్లో జరిగింది. వేణు గారు సమావేశానికి ఆహ్వానం పలుకుతూ "వీక్షణం గురించి మొదట విన్నప్పుడు వీకెండ్ లో సమావేశమా?" అనుకున్నాను. కానీ ఒకసారి అటెండ్ అయ్యేక ఇక "ఎప్పుడెప్పుడా" అని ఎదురుచూపు మొదలయ్యింది అన్నారు. వీక్షణంలో రచయితల భాగస్వామ్యాన్ని కొనియాడుతూ, యువతని అధికంగా భాగస్వామ్యుల్ని చేసే ఆలోచన చేయాలని అన్నారు.

అక్కిరాజు రమాపతి రావు అధ్యక్షత వహిస్తూ భాస్కర శతకం నుంచి "పండితులైన వారు" పద్యంతో ప్రారంభించారు. రచయిత భాషను 'జీవభాష'గా మలచాలన్నారు. తిక్కన పద్యాలు ఈ కాలానికీ సులభ సాధ్యం కావడం ఇందుకు ఉదాహరణ అన్నారు.

సభలో ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "ఫ్రీవిల్" గురించిన పరిశోధనాత్మక ప్రసంగం చేసారు. భారత దేశంలోను, పాశ్చాత్య దేశాలలోను "ఫ్రీవిల్" మూలాల్ని గురించిన ఆలోచనాత్మక ప్రసంగం ఇది. తర్వాత మహమ్మద్ ఇక్బాల్ "కావ్యాలలో పీఠికలు" అనే అంశాల పై ప్రసంగించారు. భారత అవతారికను ప్రధానంగా ఉదహరిస్తూ కావ్యాలలో పీఠికలు కవి కాలాదులు, అంకితం, జీవిత విశేషాలు మొదలైన విషయాలకు నిలయాలని చెప్పారు. పాల్కురికి సోమనాధుని, శ్రీనాధుని కావ్యాలలో అవతారికల విశేషాలను ఆసక్తి దాయకంగా వివరించారు. 'కవికి, పాఠకునికి మధ్య వారధి పీఠిక' అని ముగించారు.

తర్వాతి కార్యక్రమం "తెలుగు రచయిత" వెబ్ సైటు హోం పేజీ ఆవిష్కరణ. "తెలుగు రచయిత" వెబ్ సైటు హోం పేజీ ఆవిష్కరణ డా||కె.గీత , శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్ పెద్దు ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ ప్రభ చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్భంగా డా||కె.గీత మాట్లాడుతూ " వెయ్యి సంవత్సరాలకు పైబడి సాహిత్య చరిత్ర, ఏ ప్రపంచస్థాయి సాహిత్య ప్రమాణాలకూ తీసిపోని పరిపుష్ఠమైన సాహిత్య సృష్టీ, విశిష్టఆశుకవితా ప్రక్రియలూ, కాలంతో పాటే రూపురేఖలు మార్చుకున్న ఛందో రూపాలూ, ఒక్క శతాబ్దకాలంలోనే ఎన్నో సాహిత్యోద్యమాలూ చూసింది తెలుగు. భాషాపరిణామం, తత్త్వచింతన, ఇతిహాసం, పురాణం, జానపదసాహిత్యం, సంగీతం, నాటకం, నవల, కథ, కవిత, వ్యాసం, చరిత్ర, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలు, రేడియో, టీ.వీ మాధ్యమాలకు అనుగుణంగా మలుచుకున్న సాహిత్యప్రక్రియలూ, వీటన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించిన గొప్ప గొప్ప రచయితలు మనకు ఉన్నారు." అన్నారు.

చరిత్రను, విలువైన చారిత్రక ఆధారాలను, గొప్ప సాహిత్యకారుల జీవిత, రచనా విశేషాలనూ, వారు నివసించిన గృహాలనూ, వినియోగించిన వస్తువులనూ జాతి సంపదగా భావించి పదిలపరచుకోవలసి ఉన్నదనీ, మన కళ్ళముందే జీవించి, సాహిత్యాన్నీ, జీవన విధానాన్నీ ప్రభావితం చేసిన వ్యక్తులు మన మధ్యనుండి కనుమరుగవగానే, వారి సాహిత్యం అదృశ్యం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనకున్నదనీ, తమ జీవితాన్ని భావితరాల అభివృద్ధికీ, అభ్యున్నతికీ ధారపోసిన వ్యక్తుల గురించిన సమాచారం చెదలు పట్టకుండా జాగ్రత్త పరచుకోవడం మన కనీస ధర్మమనీ' అన్నారు.

చరిత్ర లో నిలిచిపోయే ఈ వెబ్ సైటు ఆశయాలు కార్యరూపం దాల్చడానికి రచయితలందరూ సహకరించాలని కోరారు. వెబ్ సైటు పూర్తి రూపం దాల్చి మొదటి రచయితల పేజీ రాబోయే ఉగాది నాడు ప్రారంభించబడుతుందని చెప్పారు. వెబ్ సైటు సేకరణలో ఎంతో సహకరిస్తున్న శ్రీ నౌడూరి మూర్తిగారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రచయితలు తమ రచనలనూ, జీవిత విశేషాలనూ http://www.telugurachayita.org/ లేదా http://www.teluguwriter.org/ లో సమర్పించవచ్చని అన్నారు.

తెలుగు రచయిత వెబ్సైటు నిర్వహణకు తొలి మెట్టు గా "గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఆథర్స్" -గాటా (Global Association of Telugu Authors-GATA) నాన్ ప్రాఫిట్ సంస్థ కె.గీత, వేణు ఆసూరి, సుభాష్ పెద్దు ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. వేణు, సుభాష్ గార్లు మాట్లాడుతూ "గాటా" వివరాలు అందరికీ తెలియజేసారు.

సభను అత్యంత ఆసక్తిదాయకంగా మలిచే సాహితీ క్విజ్ కార్యక్రమం కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన పిదప విరామపు విందు జరిగింది.

విరామానంతరం కార్యక్రమంలో జరిగిన కవి సమ్మేళనంలో కె.గీత "వీక్షణ నిరీక్షణ" అనే కవితను, షంషాద్ "ఎలిజీ" అనే తనకు నచ్చిన భాస్కర భట్ల కవితను చదివి వినిపించారు. తర్వాత వేణు "యోగ నిద్ర" కవితను వినిపించారు.

చివరగా వీనుల వీందైన పాటల కార్యక్రమం లో శ్రీమతి విజయ సినిమా గీతాన్ని, శ్రీమతి అపర్ణ దైవ భక్తి గీతాన్ని, డా||కె.గీత దేవుల పల్లి రచించిన "మధూదయంలో " లలిత గీతాన్ని ఆలపించి సభను అలరించారు. ఈ పాట గురించి దేవులపల్లి మేనగోడలైన వింజమూరి అనసూయా దేవి గారు చెప్పిన విశేషాలను సుభాష్ సభతో పంచుకున్నారు.

ఎడతెరిపి లేని వాన కురుస్తున్నా సభకు విచ్చేసి ఆద్యంతం ఆసక్తిగా విన్న సభలోని వారికి, సభకు ఆతిథ్యమిచ్చిన వేణు, విజయ ఆసూరి దంపతులకు కృతజ్ఞతలతో సభ ముగిసింది.

ఈ సభలో శ్రీ కృష్ణబాబు, శ్రీ సుబ్బారావు, శ్రీమతి కాంతి, శ్రీమతి వందన, శ్రీమతి ఇక్బాల్, శ్రీమతి సుబ్బలక్ష్మి మొ.న వారు పాల్గొన్నారు.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)